కరోనాకు ముందు ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెడితే దగ్గరి బంధువులతో పాటు, దూరపు చుట్టాల ఇళ్లకు కూడా వెళ్లి కార్డులు పంచేవాళ్లు. బొట్టుపెట్టి ఆహ్వానించే వాళ్లు. ఏ పెండ్లో అయితే ఊరు ఊరంతా శుభలేఖలు అందేవి. ఇప్పుడు ఆహ్వానించే పద్ధతుల్లో చాలా మార్పులొచ్చాయి. దూరపు బంధువులు, స్నేహితులకు ‘ఈ-ఇన్వైట్స్’ ద్వారా ఆహ్వానం పంపుతున్నారు. ఇలాంటి ఓ కొత్త సంప్ర దాయానికి తెరతీశారు హైదరాబాద్కు చెందిన శ్రుతిరెడ్డి, మీనాక్షి కాట్రగడ్డ.
కరోనా సమయంలో ఎంత పెద్ద శుభకార్యమైనా తూతూమంత్రంగానే ముగించేవారు. ఆ పరిస్థితుల్లో ఇండ్లకు వెళ్లి బొట్టుపెట్టి పిలవడం అన్నది నిజంగానే అసాధ్యం. అప్పుడే ‘ఈ-ఇన్విటేషన్స్’కు శ్రీకారం చుట్టారు మీనాక్షి కాట్రగడ్డ, శ్రుతిరెడ్డి. ఎవరెవరికి ఇన్విటేషన్లు పంపాలో ముందుగా నిర్ణయించుకొని చెబితే చాలు. మనం కోరినట్టుగా ‘ఈ-ఇన్విటేషన్’ను తయారు చేసి ఇస్తారు. ఇందుకోసం ఇండిపెండెంట్ గ్రాఫిక్ డిజైనర్లు, ఇలస్ట్రేటర్స్, డిజైనింగ్ ఆర్టిస్టులతో ఓ ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు.
ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండటంతో ‘పేపర్ డేట్ కో’ పేరుతో ఓ కంపెనీని స్థాపించారు ఇద్దరూ. పెండ్లిళ్లు, పుట్టినరోజులు, శ్రీమంతాలు, వెబినార్స్, వర్క్షాపులు ఇలా.. నలుగురిని ఆహ్వానించే కార్యక్రమం ఏదైనా సరే. మన ఆలోచనలు, సంస్కృతి, సంప్రదాయాలకు తగినట్లుగా ఓ ఆహ్వాన పత్రికను తయారు చేసిస్తారు. నచ్చకపోతే మొహమాటం లేకుండా మార్పులు సూచించవచ్చు. వాటిని ప్రింట్ చేసుకొని పంచుకోవచ్చు కూడా.
ప్రతీ ఆహ్వానాన్ని సందర్భానికి తగ్గట్లుగా సరికొత్తగా రూపొందిస్తారు మీనాక్షి, శ్రుతి బృందంలోని ఆర్టిస్టులు. అయితే, కార్డులతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన బహుమతులను కూడా అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏ ఈవెంట్ అయినా ఓ మైలురాయిలా మీకు గుర్తుండిపోవాలంటే www.paperdateco.com ద్వారా తమను సంప్రదించాలని కోరుతున్నారీ ఇన్విటేషన్ ఆంత్రప్రెన్యూర్స్.