లవంగాలు, మిరియాలు, మరాఠీ మొగ్గలు, యాలకులు, అనాస పువ్వు.. ఇవన్నీ నిత్యం వంటల్లో వాడుకునే సుగంధ ద్రవ్యాలు. ఆహారానికి చక్కని పరిమళాన్నిస్తూ అద్భుతమైన రుచిని జోడిస్తాయి. ఆ ఘుమఘుమలకు ధగధగలుతోడై.. నగల డిజైన్లో భాగమైతే? ఆ సరికొత్త ఆలోచనకు రూపమే.. స్పైస్ జువెలరీ. ప్రముఖ డిజైనర్ ప్రియంవద రానా ఈ ప్రత్యేక నగలకు ప్రాణం పోశారు.
అందానికి నిలయం ప్రకృతి. పువ్వులు, ఆకులు, తీగలు, మయూరాలు, ఏనుగులు, హంసలు.. సృష్టిలోని ప్రతి సొగసూ నగలలో ప్రతిబింబిస్తుంది. తాజాగా, మనం ఆహారంలో భాగం చేసుకునే మసాలా దినుసుల రూపాలూ ఆభరణాల ఆకృతిని ధరిస్తున్నాయి. పూర్తి పర్యావరణ హితమైన ముడి సరుకుతో వీటిని రూపొందిస్తున్నారు జైపూర్కు చెందిన ప్రియంవద. బంగారం, వెండి, ప్ల్లాటినమ్ వంటి ఖరీదైన లోహాలతోపాటు చవకైన ముడిపదార్థంతోనూ ఈ నగలు వస్తున్నాయి. లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లవర్స్, మరాఠీ మొగ్గలను పోలిన డిజైన్లతో ఈ నగలు మగువల మనసు దోచేస్తున్నాయి. సంప్రదాయ వస్ర్తాలతోపాటు ఆధునిక దుస్తులపైనా ఇవి చక్కగా నప్పుతాయి. ముఖ్యంగా కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లే యువతులకు చక్కని ఎంపిక. పచ్చని పసిమి ఛాయతో మెరిసే బంగారు ఆభరణాలకు రాళ్లు, రత్నాలు, ముత్యాలను జతచేస్తున్నారు.