ఆ యువతి కర్ర పడితే.. కరవాలం ఝళిపిస్తున్న రుద్రమదేవి గుర్తుకొస్తుంది. ఆ విన్యాసాలు గగుర్పాటును కలిగిస్తాయి. కర్రసాము ఆత్మరక్షణకు ఉపయోగపడటమే కాదు, ఆత్మవిశ్వాసాన్నీ ఇస్తుందని నిరూపించింది సాత్విక. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరుకు చెందిన కక్కిరేని సాత్విక కర్రసాములో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నది. కబడ్డీ, రన్నింగ్, త్రోబాల్, షూటింగ్ బాల్ వంటి క్రీడలలోనూ విజయ పథంలో దూసుకుపోతున్నది. ప్రస్తుతం, డిగ్రీ చదువుతున్న సాత్వికకు చిన్నప్పటి నుంచీ క్రీడలంటే ఇష్టం. అనేక పోటీలలో పాల్గొన్నది. ఎన్నో పతకాలూ సాధించింది. యాదృచ్ఛికంగా సాత్విక దృష్టి కర్రసాముపై పడింది. సాధనతో పట్టు సాధించింది. ఈ మధ్యే మంచిర్యాల జిల్లా మందమర్రిలో జరిగిన ‘సిలంబం’ (కర్రసాము) పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి, బంగారు పతకం సాధించింది. తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి పోటీలలోనూ సగర్వంగా వెండి పతకం అందుకుంది.
అమ్మ ప్రోత్సాహంతో..
స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ పాలకులు కర్రసామును నిషేధించారు. ఈ సంప్రదాయ క్రీడకు మళ్లీ వైభవం తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఖేల్ ఇండియా క్రీడల్లో చేర్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు ప్రతిబంధకమే అయినా, తల్లి రాణి అందిస్తున్న ప్రోత్సాహం సాత్వికను విజయ తీరాలవైపు నడిపిస్తున్నది. వీరిది మధ్య తరగతి కుటుంబం. తండ్రి రమేష్ కాలికి ఓ ప్రమాదంలో తీవ్ర గాయమైంది. దీంతో తల్లి సంపాదనపై కుటుంబం నడుస్తున్నది. చిన్నపాటి కిరాణా దుకాణమే ఆధారం. ‘యుద్ధ కళ ఆత్మరక్షణకు ఉపయోగ పడుతుంది. నా వంతుగా పదిమందికీ శిక్షణ ఇస్తా. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి అమ్మ కలను నెరవేరుస్తా’ అంటున్నది సాత్విక.