నిజాంసాగర్, అక్టోబర్13: విమానాశ్రయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో వారికి ఎంపీ బీబీ పాటిల్ సాయం అందించారు. వారి కోసం విమానం అరగంటపాటు ఆగేలా చొరవ తీసుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, జోగులాంబ, గద్వాల్, హైదరాబాద్కు చెందిన 32 మంది మిత్రులు విహారయాత్ర కోసం 4 రోజుల కిందట కేరళ వెళ్లారు. వారంతా గురువారం కొచ్చిన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చేందుకు ఇండిగో సంస్థకు చెందిన విమానం టికెట్లు బుక్ చేసుకున్నారు.
కొచ్చిన్ నుంచి విమానం సాయంత్రం 7 గంటలకు బయల్దేరాల్సి ఉన్నది. అయితే వీరు హోటల్ నుంచి 2 గంటల ముందే బయల్దేరారు. మార్గమధ్యలో రహదారిపై ట్రాఫి క్ జామ్ కావడంతో సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేకపోయా రు. దీంతో విమానం బయల్దేరే సమయం దాటిపోతుండటంతో ఈ విషయాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన ఎంపీ బీబీ పాటిల్.. ఇండిగో విమానం యాజమాన్యంతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. దీంతో విమానాన్ని యాజమాన్యం అరగంట పాటు నిలిపేసింది. వీరంతా వచ్చాకే విమానం కొచ్చిన్ నుంచి బయల్దేరగా. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. తమకు సాయం చేసినందుకు ఎంపీ బీబీపాటిల్కు వారు కృతజ్ఞతలు తెలిపారు.