చేగుంట, ఆక్టోబర్ 4: దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్రావు ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. ఆమె చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం చిన్నశంకరంపేట నుంచి చేగుంటకు చేరుకున్నది. రోడ్డుషోలో భాగంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే మల్లన్నసాగర్ బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చరా అని ప్రశ్నించారు. తాను గెలిస్తే ప్రతి రైతుకు కాడెడ్లను ఇప్పిస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఒక్క ఎైద్దెనా ఇచ్చారా అని ఎద్దేవా చేశారు.
బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెస్తానని, రైలు, పరిశ్రమలు వస్తాయని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికల ముందు తాను గెలిస్తే దుబ్బాకలో కుటుంబ సభ్యులతో దవాఖాన కట్టించి ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని దుయ్యబట్టారు. దుబ్బాకలో కాదు, అమీర్పేటలో కట్టారని, అది ఉచితం కాదు దోచుకునేలా ఉందని వైఎస్ షర్మిల విమర్శించారు. పావురాల గుట్టలో పావురంలా కలిసిపోయాడని అన్న ఎమ్మెల్యే రఘునందన్కు వైఎస్ను విమర్శించే హక్కు లేదని, ఆయన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జోగిపేట ఠాణాలో
దళిత సంఘాల ఫిర్యాదు
అందోల్, అక్టోబర్ 4: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై జోగిపేట ఠాణాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. స్థానిక దళిత ఎమ్మెల్యే క్రాంతికిరణ్పై ఆమె అగ్రకుల అహంకారంతో మాట్లాడారని పలువురు దళిత సంఘాల నాయకులు సోమవారం జోగిపేట పోలీస్టేషన్లో ఎస్సై సామ్యానాయక్కు ఫిర్యాదు చేశారు. దళిత సంఘం నాయకుడు రాజు ఫిర్యాదు మేరకు మంగళవారం షర్మిలపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు జోగిపేట సీఐ నాగరాజు, ఎస్సై సామ్యానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకుడు రాజు మాట్లాడుతూ గత నెల 30న జోగిపేటలో షర్మిల పాదయాత్ర సందర్భంగా దళిత ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.
స్పందన కరువు..
వైఎస్ షర్మిల ప్రజా సంగ్రామ యాత్రకు కూలీలు
రోడ్డుమీదనే కూలీలకు డబ్బులు
చేగుంట, అక్టోబర్4: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుంచి స్పందన లేకపోవడంతో గ్రామాల నుంచి కూలీలను డబ్బు లు ఇచ్చి తీసుకువస్తున్నారు. చేగుంట మం డలం, చిన్నశంకరంపేట మండలాల నుంచి, రెండు వందలు, ఐదు వందలు ఇస్తామని బతిమాలి తీసుకువస్తున్నారు. చేగుంటలో డీసీఎంల వద్దనే కూలీలకు డబ్బులు ఇవ్వగా, వడియారంలో డబ్బుల ఇస్తామని చెప్పడంతో వచ్చిన వారు రోడ్డుపైనే నిరీక్షించారు.