పట్నా: బీహార్ శాసనసభలో బుధవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష నాయకుడు తేజస్వీయాదవ్ మాటిమాటికి అడ్డుతగిలాడు. తన 15 ఏండ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాల గురించి సీఎం నితీశ్ కుమార్ సభలో చెబుతుండగా తేజస్వీయాదవ్ పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ముందుగా తనను మాట్లాడనివ్వాలని, దానివల్ల మీక్కూడా ప్రయోజనం ఉంటుందని, ఆ తర్వాత మీరు చెప్పదల్చుకున్నది చెప్పండి అని నితీశ్కుమార్ తేజస్విని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అయినా తేజస్వి వినిపించుకోకుండా వాజ్పేయి హాయాంలో నితీశ్ కేంద్రమంత్రిగా పనిచేసినప్పుటి విషయాన్ని ప్రస్తావించబోవడంతో.. నితీశ్ అడ్డుపడి నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. అప్పుడు నువ్వు నా ఒడిలో ఆడుకోలేదా..? అని చమత్కరించారు. దాంతో సభ్యులంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు.