ముంబై : ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోదీ సర్కార్ కొలువు తీరగా ఆపై కొలువుల ఊసే మరిచింది. ఉపాధి అవకాశాలు లేక యువత భవిష్యత్ ఛిద్రమవుతున్నా ఉద్యోగాల కల్పన దిశగా కేంద్రం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదు. ఈ నేపధ్యంలో ఉద్యోగాలు ఇవ్వాలంటూ పలువురు యువకులు నాగపూర్ నుంచి ఢిల్లీకి కాలినడకన చేరుకున్నారు.
పారామిలటరీ బలగాల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏకంగా వేయి కిలోమీటర్ల పాదయాత్రకు యువత పూనుకుంది. పారా మిలటరీ బలగాల్లో 5000 పోస్టులను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టడం లేదని వారు ఆరోపించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగ యువత నిరసన చేపట్టింది. పాదయాత్ర సందర్భంగా పలువురు కుప్పకూలిపోవడంతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారు. మరోవైపు ఉద్యోగాలు కల్పించాలనే నినాదాలతో కూడిన టీ షర్ట్లు ధరించి యాత్రలో పాల్గొన్న యువకుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.