న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటో తేదీన సమీప బంధువులు.. హితులు.. సన్నిహితులు.. మిత్రులు మిమ్ముల్ని ఫూల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నవ్వుల జల్లులు వెల్లివిరుస్తాయి… కానీ ఈ నెల ఒకటో తేదీ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో పన్నులు, ఇతర సేవలపై చార్జీల రూపేణా కేంద్ర సర్కార్ విధించిన పన్నుల మోతతో మీ పర్సు ఖాళీ చేయడం ప్రారంభం అవుతున్నది.
మన నిత్యజీవితంలో భాగమైన టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ ఫోన్లు, ప్రయాణానికి ఉపయోగించే కార్లు, బైక్లు, విమానాల టికెట్ల ధరలు పెరిగాయి.ప్రత్యేకించి కొన్ని వస్తువులను గానీ.. వాటిలోని విడి భాగాలను దిగుమతి చేసుకుంటే ఇప్పటివరకు మినహాయింపులు ఉండేవి..
కరోనా వల్ల ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్నది. ఈ నేపథ్యంలో మేడిన్ ఇండియా నినాదం పేరిట దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు విదేశీ దిగుమతులను నిరుత్సాహాపర్చాలని కేంద్రం నిర్ణయించింది.
కనుక దిగుమతులపై పెంచిన సుంకాలు, తగ్గిన మినహాయింపులు మీ పర్సు ఖాళీ చేస్తాయి. ఈ నెల నుంచి సుంకాలు, పన్నులు, ఇతర కారణాల రీత్యా పెరిగే వస్తు, సేవల వివరాలు తెలుసుకుందామా..!
గత ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్లో బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్.. కెమెరా మాడ్యూల్, బ్యాక్ కవర్, కనెక్టర్లపై మినహాయింపులు ఎత్తేశారు. బ్యాటరీ ప్యాక్లు, ఫోన్ చార్జర్ల ధరలు ప్రియం కానున్నాయి.
ఇప్పుడంతా టెక్నాలజీ యుగం.. అయినా ఆటోమొబైల్ రంగంలో కార్లు, బైక్స్లో చాలా అత్యవసర విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది.ఈ క్రమంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పెంచేశారు. ఫలితంగా పలు కార్లు, బైక్ల ధరలు మరింత పెరుగనున్నాయి.
ఏసీ మిషన్లు, ఫ్రిజ్లు కొనుగోలు చేసేవారికి హెచ్చరిక. వాటిలో వాడే కంప్రెసర్లను దిగుమతి చేసుకోవాల్సిందే. దిగుమతి చేసుకునే కంప్రెసర్లపై కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెంచేశారు.
12.5 నుంచి 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంచేయడంతో ఏసీలు, ఫ్రిజ్ల ధరలు పెరుగనున్నాయి. వీటిని కొనుగోలు చేయాలని భావించే వారు మీ ఇంటి బడ్జెట్ను పునర్వ్యవస్థీకరించుకోవాల్సిందేనని నిపుణులు అంటున్నారు.
మేకిన్ ఇండియా స్కీమ్ను ముందుకు తీసుకెళ్లేందుకు విదేశీ ఉత్పత్తుల దిగుమతిపై ఇప్పటివరకు ఉన్న మినహాయింపులు ఎత్తేసింది కేంద్రం.. కనుక విలాసవంతమైన షూ, బ్యాగ్లు కొనాలంటే కాస్త ఆలోచించుకోవాల్సిందే.
ఎయిర్ ట్రావెల్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరగడం.. ఎయిర్లైన్స్ను ఆదుకోవడానికి ఎయిర్ సెక్యూరిటీ ఫీజు పెంచుతూ పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) నిర్ణయం తీసుకున్నది.. కనుక దేశీయ, విదేశీ విమాన ప్రయాణం చేయాలన్న టికెట్ల ధరలు మోత మోగనున్నది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఆల్ ఫూల్స్ డే.. ఎందుకు..? ఎప్పుడు..? ఎలా..? చరిత్రలో ఈరోజు
పాన్, ఆధార్ లింక్ తుది గడువు జూన్ 30కు పొడిగింపు
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు