భద్రాద్రి కొత్తగూడెం : ఆస్తి పంపకాల తగాదాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అన్నపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుపల్లి మండలం మొక్కంపాడు గ్రామ పంచాయతీ మొక్కంపాడు తాండాలో గడిచిన శనివారం రాత్రి చోటుచేసుకుంది. బానోత్ పంతులు కుమారులైన బానోత్ దేవ్లా, బానోత్ వినోద్ మధ్య ఆస్తి పంపకాల్లో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం రాత్రి అన్న బానోత్ దేవ్లా తన బైక్పై లాక్యతండా నుంచి మొక్కంపాడు వైపు వస్తున్నాడు. మార్గమధ్యలో అతడి తమ్ముడు వినోద్ ఎదురుపడి కొబ్బరిబొండాలు నరికే కత్తితో నరికాడు. అనంతరం బోడు పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ దాడిలో దేవ్లా కుడి కన్నుకు, చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.