అదొక అడవి. మధ్యలో చిన్న చిన్న గూడేలు. ఒక తొవ్వ ఉండదు.. తోడు ఉండదు. యేండ్ల తరబడి అవే కష్టాలు.. అవే వెతలు. చదువంటే ఏమిటో కూడా తెలియదు. చిరిగిపోయిన బట్టలు.. చింపిరి జుట్లు.. భవిష్యత్ కండ్లముందే కనిపిస్తుంది. అలాంటి అడవి బిడ్డల జీవితాల్లో అక్షర కాంతులు నింపుతున్నారు కొందరు యువకులు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఓ ఐదు గ్రామాలను ప్రపంచం గమనిస్తున్నది. యేండ్ల తరబడి చదువుకు దూరంగా ఉన్న ఆ పల్లెల్లో విద్యా పరిమళాలు వెదజల్లుతున్నారు కొందరు యువకులు. చదువంటే అవగాహన కల్పిస్తూ ఇప్పపూల వనాలను సరస్వతీ నిలయాలుగా మారుస్తున్నారు.