చెన్నై: తమిళనాడుకు చెందిన ఎన్జీ అర్జున్ ప్రభు అనే యువకుడు ఏడాది క్రితం ఆటోపై ఇంటిని నిర్మించాడు. అందులో ఒక చిన్న బెడ్ రూమ్, కిచెన్, లివింగ్ ఏరియా, వర్క్ ఏరియా, బాత్రూమ్ ఉన్నాయి. అంతేకాదు, ప్రభు ఆ ఇంటి కోసం 250 లీటర్ల వాటర్ ట్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లిపోయే ఈ మొబైల్ ఇంటిని నిర్మించడానికి అతడికి లక్ష రూపాయల వరకు ఖర్చయ్యిందట.
అయితే, ప్రభు నిర్మించిన ఆ ఆటో ఇంటిని చూసి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించడంతో.. ఆటో ఇల్లు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆటో ఇంటికి ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ఆ యువకుడికి ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తమ కంపెనీకి చెందిన బొలెరో వాహనాన్ని అలాంటి డిజైన్తో నిర్మించాలనుకుంటున్నానని పేర్కొన్నారు.