రాళ్లురప్పలు.. ఎగుడు దిగుడులు.. ఎన్నో వంకరలు ఉన్న ఓ రోడ్డుపై ఓ యువకుడు నడుముకు టైర్ కట్టుకుని పరుగులు తీస్తున్నాడు. ఇలా ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఆరు సంవత్సరాలుగా ఆ యువకుడిది అదే దినచర్య. యువకుడి పరుగును చూసి ఆశ్చర్యంగా చూసే స్థానికులు కొన్నిసార్లు నవ్వుకునేవారు. అయినా ఆ యువకుడు పరుగు మాత్రం ఆపలేదు. ఓ వైపు పేదరికం వెక్కిరిస్తున్నా.. మరో వైపు పోటీలకు వెళ్లేందుకు పైసలు లేకున్నా.. ఆ యువకుడు పైసాపైసా పోగు చేసి పోటీలకువెళ్లి గెలిచి నిలిచాడు. కోచ్ లేకుండా, గ్రౌండ్కు వెళ్లకుండానే చివరకు విజేతగా అవతరించాడు. పరుగు పందెంలో పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతూ
అద్భుత విజయాలను నమోదు చేసిన పెండ్యాల యోగేశ్పై ప్రత్యేక కథనం..
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేటకు చెందిన పెండ్యాల కిషన్, అమృత కుమారుడు యోగేశ్. ప్రస్తుతం చంపాపేట్లోని వేద డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్నతనం నుంచి పరుగుపై ఉన్న ఇష్టంతో పేదరికంలో ఉన్న నిరంతరం కఠోర సాధన చేస్తున్నాడు. కోచింగ్కు డబ్బులు లేకున్నా.. కోచ్ లేకుండా, గ్రౌండ్కు వెళ్లకుండానే జాతీయస్థాయి అథ్లెటిక్స్లో బంగారు పతకాలు సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
పాకెట్మనీతో పరుగుల పోటీకి..
పెండ్యాల యోగేశ్ది పేద మధ్యతరగతి కుటుంబం. తండ్రి కిషన్ హోంగార్డుగా పని చేస్తుండగా, తల్లి అమృత ఇస్త్రీ చేస్తుంది. తల్లిదండ్రులు యోగేశ్కు ఇచ్చే పాకెట్ మనీని జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ అథ్లెటిక్స్ పోటీలకు వెళ్లేవాడు. నగరంలో జరిగే ప్రతి అథ్లెటిక్స్ పోటీకి యోగేశ్ తప్పకుండా హాజరయ్యేవాడు. ఈ పోటీల్లో అనేకసార్లు విజేతగా నిలిచి నగదు బహుమతులను సొంతం చేసుకున్నాడు. ఇలా వచ్చిన డబ్బులను కూడా తన పరుగుపందెం పోటీల కోసమే వెచ్చించేవాడు. నేపాల్లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలకు వెళ్లడానికి రూ.40వేలు, ఢిల్లీకి పోవడానికి రూ.15వేలు ఖర్చు అయినట్లు యోగేశ్ తెలిపాడు.
స్థానికుల నుంచి ఘన స్వాగతం
నేపాల్లోని పోక్రాన్లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించినందుకు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కార్పొరేటర్ తీగల మాధవి సాయినాథ్రెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె పాండుగౌడ్, కాంత్రి యూత్ అసోసియేషన్, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్, పుట్టలమ్మ దేవాలయ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు పెండ్యాల యోగేశ్ను ఘనంగా సత్కరించారు.
ఒలింపిక్సే లక్ష్యం
అథ్లెటిక్స్లో ఇతర ప్రాంతాలకు పోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. క్రీడా వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. భారతదేశం తరుఫున ఒలింపిక్స్లో ఆడాలనేది నా కల. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడానికి కోచ్ సహకారం తప్పనిసరి. దాతలు సహకరిస్తే కోచింగ్కు వెళ్లి కఠోర సాధన చేసి దేశానికి పతకం తెస్తాననే విశ్వాసం ఉంది.
సాధించిన పతకాలు :
నిజామాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలో పాల్గొని ఐదు వేల మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించాడు. ఢిల్లీలోని మంత్రలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించాడు. నేపాల్లోని పోక్రాన్లో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించాడు.