అమరావతి : కాకినాడ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యహత్య ఘటనలో ఎమ్మెల్సీని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన ట్విటర్లో కోరారు. సుబ్రహ్మణ్యంను రాత్రి కారులో తీసుకెళ్లిన ఎమ్మెల్సీ కారణం చెప్పకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు, భార్యకు అప్పగించి వెళ్లడం అనుమానాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.
హత్యను ప్రమాద ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ అనంత బాబుని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఏపీ బీహార్ కంటే దారుణంగా మారిందని ఆరోపించారు. వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? అని లోకేశ్ ప్రశ్నించారు. ఎంతో భవిష్యత్ ఉన్న కుమారుడ్ని కోల్పోయిన తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.