అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతలు తాలిబన్లను తలపిస్తున్నారని ఆరోపించారు. జగన్ ఏపీని రావణకాష్టంగా మార్చేశారని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నివాసం దగ్గర వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఖబడ్దార్ జగన్మోహన్ రెడ్డి, దీనికి బదులు తప్పదంటూ హెచ్చరించారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ గూండాలు ప్రయత్నించడం దారుణమైచర్య. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనం.
ప్రజాస్వామ్యం మంటగలిసింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటుపడిన జగన్ రెడ్డి ఏపీని ఆఫ్ఘనిస్థాన్ గా మార్చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ప్రతిపక్షంగా మాట్లాడటం తప్పా? ప్రజా సమస్యలపై నిలదీస్తే గూండాగిరి చేస్తారా? జోగి రమేశ్ ఎమ్మెల్యేనా లేక గూండానా? మాజీ ముఖ్యమంత్రి , జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు ఇంటిపై రౌడీ మూకను వేసుకొచ్చి రాళ్ల దాడి చేయడమేంటి? దాడిని అడ్డుకున్న టీడీపీ నేతలపై రాళ్ల దాడి చేయడం జగన్ అరాచక పాలనలోనే చూస్తున్నాం. రెండున్నరేండ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అధికారాన్ని, పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.