మంగళగిరి: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే నేతలు పార్టీలు మారుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న పార్టీ నుంచి టికెట్ దొరకదని భావిస్తున్న నేతలు టికెట్ ఇచ్చే పార్టీ కోసం ఇప్పటి నుంచే వెతుకుతున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత ఒకరు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత 35 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా తనకు ఎమ్మెల్యేగా అవకాశం రాకపోవడంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరకు చెందిన వైసీపీ నేత వుయ్యురు శివ రామిరెడ్డి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయనకు పవన్ కల్యాణ్ తమ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరడం తనకు సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా శివరామిరెడ్డి మీడియాతో అన్నారు.
వుయ్యూరు శివరామిరెడ్డి 1987 లో తెలుగుదేశం పార్టీలో చేరి.. మూడేండ్ల పాటు మండల అధ్యక్షుడిగా ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించడంతో ఆయన వంచన చేరి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడయ్యారు. 2012 లో వైసీపీలో చేరారు. జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెంది పవన్ కల్యాణ్ వెంట నడిచేందుకు నిర్ణయించుకున్నట్లు శివరామిరెడ్డి చెప్పారు. కాగా, తెనాలి నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్గా నాదెండ్ల మనోహర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.