తాడేపల్లి : అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ ఎమ్మెల్యేలను జగన్ సిద్ధం చేస్తున్నాడు. మొత్తం సీట్లలో పాగా వేయాలన్న పథకంలో భాగంగా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో జగన్ సమావేశమై చర్చించారు. వాడివేడిగా సాగిన ఈ సమావేశంలో 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఖరాకండితంగా చెప్పారని, పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చేది లేదని చెప్పినట్లు సమాచారం. నేతల పనితీరుపై ఐప్యాక్ ఇచ్చిన నివేదికపై జగన్ సమీక్షించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని సమీక్షించిన పార్టీ అధినేత జగన్.. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పినట్లు తెలుస్తున్నది. వారి పేర్లను కూడా ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఐప్యాక్ ఇచ్చిన ప్రోగ్రేస్ రిపోర్ట్ ఆధారంగా వారికి క్లాస్ తీసుకున్నట్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ వారు చేస్తున్న తప్పిదాలను బయటకు వెల్లడిస్తున్నారని నాయకులు చెప్తున్నారు. ఇదే సమయంలో ఎందుకలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలువురకి ఇలా చేయొచ్చు కదా అంటూ దశ దిశ చేసినట్లు సమాచారం.
గతంలో చెప్పినట్లుగా 175 సీట్ల టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్రతీ ఒక్కరూ నడుం వంచాలని జగన్ సూచించినట్లు నేతల ద్వారా తెలుస్తున్నది. ఎమ్మెల్యేలు కొందరు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని తమాషాగా తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలను మొక్కుబడిగా చేస్తున్న వారిని పేరుపేరునా చెప్తూ వీరంతా తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారంట. ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగింది. వచ్చే నవంబర్లో మరోసారి సమీక్ష జరుపుతానని, అప్పటిలోగా పనితీరు మెరుగుపర్చుకోవాలని ఒక రకంగా హెచ్చరిక చేసినట్లుగా పార్టీ నేతల ద్వారా తెలుస్తున్నది.
ప్రతీ ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు : మంత్రి పేర్ని నాని
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరవుతున్నారని మంత్రి పేర్ని నాని చెప్పారు. కొందరు గ్రామ సచివాలయాలకు వెళ్లి గంట కూడా సమయం కూడా కేటాయించడం లేదని, వీరు పనితీరు మార్చుకోవాలన్నారని చెప్పారు. ప్రతి ఇంటికి తిరగాలని, మనుషులతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని సూచించారని తెలిపారు. సచివాలయంలోని ప్రతి ఇంటికి వెళ్లాల్సిందే అని జగన్ చెప్పారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేదని చెప్పి, నవంబర్లో మళ్లీ సమీక్షించేనాటికి మారకపోతే వచ్చే అసెంబ్లీలో టికెట్ కేటాయించడంపై ఆలోచించాల్సి వస్తుందని చెప్పారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పారని పేర్ని నాని చెప్పారు.