న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు కరోనా టీకాల విధానాన్ని విమర్శిస్తూ పోస్టర్లు వేశారంటూ ఢిల్లీలో 17 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రా తదితరులు ట్విట్టర్లో మోదీపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ బీజేపీ, ప్రస్తుత తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా కేంద్ర విధానాలపై ధ్వజమెత్తారు. “పది సెకన్ల వీడియో మోదీ భండారం బయటపెట్టింది. భారత్ తన ప్రజలకు ఇచ్చినదానికన్నా ఎక్కువ చీకాలను విదేశాలకు పంపిందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి చెప్పారు. మోదీ ఇప్పుడు నిజంగా ప్రపంచ నేత. భారతీయులు ఎట్లా కొట్టుకపోతేనేం” అని ట్విట్టర్లో సిన్హా తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ కామెంట్తో పాటే ఆయన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత రాయబారి నాగరాజ నాయుడు మార్చిలో చేసిన ప్రసంగం క్లిపింగ్ను జతచేశారు. ఇండియాలో ఇచ్చిన టీకాల కన్నా అధికంగా 70 దేశాలకు ఇండియా టీకాలు చేరవేసినట్టు రాయబారి చెప్పడం అందులో కనిపిస్తుంది.