హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మండిపడ్డారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు పడతాయి. అందులో సందేహం లేదు. కానీ, విషయం అదికాదు. ఈ యుద్ధం రాష్ట్రపతి ఎన్నికలతో ముగియదు. తరవాత కూడా కొనసాగుతుందని యశ్వంత్ సిన్హా తేల్చిచెప్పారు. తనకు తెలంగాణలో ఇంత ఘన స్వాగతం లభిస్తుందని ఊహించలేదు.. అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ అని యశ్వంత్ సిన్హా అన్నారు.
హైదరాబాద్ జలవిహార్లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన మద్దతు సభలో సిన్హా పాల్గొని ప్రసంగించారు. దేశంలో పీపుల్స్ మూమెంట్ మొదలైందన్నారు. టీఆర్ఎస్ తరపున కేటీఆర్ ఢిల్లీ రావడం తనకు మరింత బలం చేకూరిందన్నారు. రాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు- ఇద్దరి ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య పోటీ అని పేర్కొన్నారు. దృఢమైన సంకల్పంతో వెళ్తే విజయం తథ్యమని తాను నమ్ముతానని యశ్వంత్ స్పష్టం చేశారు.
మోదీపై పోరాటం రాష్ట్రపతి ఎన్నికతోనే ఆగదు.. తరువాత కూడా కొనసాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ను కలుపుకొని జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. కేసీఆర్ విజన్ బాగుంది.. దాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు. తమ పోరాటం భారత భవిష్యత్ కోసమేనని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మూలాలను రక్షించడానికి తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతి పదం వాస్తవమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఒక్కరే తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్లో కొట్లాడారు. కేసీఆర్ తన స్వప్నం నెరవేర్చుకున్నారు.. కానీ అక్కడితో ఆగకుండా తెలంగాణను దేశంలో నెంబర్ గా నిలిపారని యశ్వంత్ సిన్హా ప్రశంసించారు.