యాదాద్రి, మే 28: యాదాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కితాబిచ్చారు. శనివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొన్నారు. మొదటగా స్వయంభూ పంచనారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధానార్చక బృందం ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గర్భాలయ ముఖ మండపంలో ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఇంచార్జి ఈవో రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం యాదాద్రి ప్రధానాలయాన్ని వీక్షించారు. ఆయన వెంట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయన్ తదితరులు ఉన్నారు.