యాదాద్రి: వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వరుడి పూజా దులతో సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కోలాహలం నెలకొంది. ఉదయం భక్త జనులు పరవశం తో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు.
ప్రభాతవేళలో మొదటగా గంటన్నర శివుడ్నికొలుస్తూ రుద్రాభిషేకంలో మమేకమ య్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. విభూతితో ఆలంకరణ చేశారు. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు.
యాదాద్రీశుడికి నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహహోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండి జోడు సేవను అత్యంత వైభవంగా జరిపారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల స్వామి వారి నిత్య కైంకర్యాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్య నారాయణ వ్రతాలలో భక్తులు పాల్గొని సామూహిక వ్రతాలచరించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం పూర్తి కాగానే స్వామి వారికి కొబ్బరికాయలు సమర్పించుకున్నారు.