యాదగిరిగుట్ట, జనవరి 7 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఈ నెల 2న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు శనివారం ముగిశాయి. స్వయంభూ ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం స్వామి వారిని అలంకరించి ఆళ్వారాధుల ముందు ప్రబంధ పారాయణాలను పారాయణికులచే పఠించి, భక్తుల దర్శనార్థం తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయంలో ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశ స్నపన మహోత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘల్ లక్ష్మీనర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, వేద పండితులు పంచరాత్రాగమ సంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఇరామానుజ నుత్తందారి ఉపదేశరత్తినమాలై అనుసంధానం గావించి అధ్యయనోత్సవాలకు పరిపూర్ణం గావించారు. అనంతరం అధ్యయనోత్సవాలకు వచ్చిన దివ్య ప్రబంధ పారాయణికులను ఆలయాధికారులు ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, ఆలయ అధికారులు సురేందర్రెడ్డి, రాంమోహన్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అలంకార విశిష్టత
అధ్యయనోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆరో రోజు స్వయంభువుడి క్షేత్రంలో నృసింహ అవతారంలో స్వామి వారిని తీరువీధి సేవ నిర్వహించారు. కృత యుగంలో తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు సింహ ముఖం, నరుడి శరీరంతో అవతరించిన అపూర్వ అవతారమే శ్రీ నారసింహ అవతారం. అంతర్వాప్తియై అంతటా కనిపించే దైవం నర్సింహుడేనని దివ్య ప్రబంధాలు, వేద, వివిధ రూపాలను దర్శింపజేస్తూ అనుగ్రహిస్తున్నాడు. యాదగిరి పంచ నారసింహుడిగా స్వయంభువై వెలసి కోరిన వారికి కొంగు బంగారమై సిరి సంపదలు అందిస్తూ భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. తన పట్ల అచంచలమైన భక్తి, విశ్వాసాలు కలిగి ఉన్న వారికి తాను వెన్నంటి ఉండి సంరక్షిస్తానని స్వామివారి ఈ అలంకార సేవలో భక్తులకు దర్శనమిస్తున్నాడు.
ఘనంగా తిరుప్పావై పూజలు
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట ప్రధానాలయంలో అర్చకులు వేదమంత్రాలను పటిస్తూ తిరుప్పావై పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్టలో స్వామి వారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు.
స్వామివారి సేవలో దక్షిణాది రాష్ర్టాల విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్లు, సభ్యులు
లక్ష్మీనరసింహుడిని విద్యుత్ నియంత్రణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ టి.శ్రీరంగరావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజ్, బి.కృష్ణయ్య, ఎన్.నాగరాజు, విద్యుత్ నియంత్రణ కమిషన్ కేరళ రాష్ట్ర చైర్మన్ టీకే.జోష్, సభ్యుడు బి.ప్రదీప్, ఎండీ రవి, విద్యుత్ నియంత్రణ కమిషన్ కర్ణాటక రాష్ట్ర చైర్మన్ పి.రవికుమార్, సభ్యుడు హెచ్ఎం మంజునాథ, విద్యుత్ నియంత్రణ కమిషన్ తమిళనాడు రాష్ట్ర చైర్మన్ ఎం.చంద్రశేఖర్, సభ్యుడు కే.వెంకటేశన్, విద్యుత్ నియంత్రణ కమిషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్ జస్టిస్ సీవీ.నాగార్జునరెడ్డి, సభ్యుడు ఠాకూర్ రమాసింగ్, పీఆర్.రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్శర్మ ప్రసాదం అందించారు. కార్యక్రమంలో విద్యుత్ విభాగం ఈఈ వుడేపు రామారావు పాల్గొన్నారు.
రూ.26,38,874 ఆదాయం
శనివారం సుమారు 23 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 26,38,874 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్. గీత తెలిపారు.
నేటి నుంచి కల్యాణోత్సవం
అధ్యయనోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్టలో తాత్కాలికంగా నిలిపివేసిన స్వామి, అమ్మవార్ల నిత్య, శాశ్వత కల్యాణోత్సవం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శ నారసింహ హోమం నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు యథావిధిగా ఆర్జిత పూజలు కొనసాగుతాయని తెలిపారు.