యాదాద్రి: యాదాద్రీశుడి బాలాలయంలో మంగళవారం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం 4గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హార తి నివేదనలు అర్పించారు. ఉదయం 8గంటలకు నిర్వహించిన సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు.
ప్రతీరోజు నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు.
సాయంత్రం వేళ అలంకార వెండి జోడు సేవలను నిర్వహించారు. కొండకింద పాత గోశాల వద్ద వ్రత మండపంలో సత్య నారాయణ స్వామి వ్రతాలలో భక్తులు పాల్గొని వ్రతమాచరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి.