ఆలేరు రూరల్, అక్టోబర్ 28 : పల్లె చిన్నదైనా అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది మండలంలోని శ్రీనివాసపురం. ఈ గ్రామం ఇంతకుముందు పటేల్గూడెం గ్రామపంచాయతీలో ఉండేది. ప్రస్తుతం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడడంతో ప్రగతిలో దూసుకెళ్తున్నది. 1235 మంది జనాభా ఉండగా, అందులో స్త్రీలు 613, పురుషులు 622మంది ఉన్నారు. ఓటర్లు 707, ఇండ్లు 217 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా నిర్దేశించిన పనులను పాలకవర్గం ప్రణాళికతో పూర్తి చేసింది. ఫలితంగా గ్రామపంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. 90శాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తయ్యాయి. నర్సరీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించారు. ఏడో విడుత హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ ట్యాంకర్ సహాయంతో రోజూ మొక్కలకు నీళ్లు పోస్తున్నారు.
అభివృద్ధి పనులు ఇలా..
ఈజీఎస్, గ్రామ పంచాయతీ నిధులు రూ.25లక్షలతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మించారు. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రూ.2.50లక్షలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.12.50లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. ఎకరం చెరువు భూమిని చదును చేసి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అందులో వివిధ రకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటారు. అవి ఏపుగా పెరిగి ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయి. వైకుంఠధామం నిర్మాణంతో దహన సంస్కారాల సమస్య తొలగిపోయింది. బోరు వేసి నీటి వసతిని కల్పించారు. రోజూ గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కార్మికులు మురుగు కాల్వలు, వీధులను శుభ్రం చేస్తున్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయిస్తున్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే..
ప్రజల భాగస్వామ్యంతో గ్రామపంచాయతీని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. పల్లె ప్రగతి ద్వారా వచ్చే నిధులను గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే పల్లె ప్రగతి పనులను పూర్తిచేశాం. మా గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డికి రుణపడి ఉంటాం.
పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నాం
గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నాం. నాటిన మొక్కలకు వనసేవకులతో నీళ్లు పోయించి సంరక్షిస్తున్నాం. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. గ్రామాలు పురోగతి సాధించేందుకు పల్లె ప్రగతి ఎంతగానో దోహదపడుతున్నది. పల్లె ప్రకృతి వనాలతో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం నెలకొంటున్నది.
-సలీం, ఎంపీఓ, ఆలేరు
గ్రామం పరిశుభ్రంగా మారింది
గతంలో శ్రీనివాసపురం సమస్యల నిలయంగా ఉండేది. అపరిశుభ్ర వీధులతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామం పూర్తిగా పరిశుభ్రంగా మారింది. ప్రభుత్వం సమకూర్చిన ట్రాక్టర్ ద్వారా రోజూ చెత్త సేకరిస్తున్నాం. ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలతో గ్రామం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది.
-శ్రీలత, పంచాయతీ కార్యదర్శి