ఆధ్యాత్మిక హంగులతో మహాద్భుతంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని వచ్చే సంవత్సరం మార్చి 28న పునఃప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించగా అందుకనుగుణంగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ పనులు
తుదిదశకు చేరుకోగా భక్తుల వసతులపై వైటీడీఏ అధికారులు దృష్టిపెట్టారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి ఆలయాన్ని పరిశీలించి పలు సూచనలు ఇవ్వడంతో పనుల్లో వేగం పెంచారు. మరో మూడు నెలల్లో పనులన్నీ పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు.
యాదాద్రి, అక్టోబర్ 26 : కృష్ణశిలల కమనీయతతో మహాద్భుతంగా పూర్తి చేసుకున్న యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి నూతనాలయం 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రారంభం కానుంది. ఇప్పటికే యాదాద్రీశుడి కోవెల సర్వం సిద్ధం చేసుకోగా.. భక్తుల సకల వసతులపై వైటీడీఏ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి కేసీఆర్ తుది మెరుగుల పనులను పరిశీలించి భక్తుల వసతుల పనులను ప్రారంభంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో ఆలయంలో తుది దశకు చేరుకున్న పనులు మరో మూడు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
యాదాద్రి కొండపైన 2.5 లక్షల టన్నుల గురుజపల్లి కృష్ణశిలతో ఏకతల, సప్తతల, పంచతల, త్రితల రాజగోపురాలు, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కృష్ణశిలతో అష్టభుజి మండపాలతోపాటు వైష్ణవతత్వం ఉట్టిపడే విధంగా పాంచరాత్రాగమశాస్త్రం, శిల్పాశాస్త్రం, వాస్తుశాస్త్రంతో నిర్మించిన యాదా ద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రార ంభానికి సిద్ధమైంది. దేవాలయం తూర్పు దిశలో రామలింగేశ్వరుడి ఆలయం పూర్తయింది. లడ్డూ ప్రసాద విక్రయాల భవనం సిద్ధం కావడంతోపాటు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా నిర్మిస్తున్న మూడంతస్తుల క్యూ కాంప్లెక్స్, ఆ పక్కనే స్వామివారికి వినియోగించే విష్ణు పుష్కరిణి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. క్యూ కాంప్లెక్స్ పక్కనే బస్సులు కొండపైకి వచ్చేందుకు 8, కొండ కిందకు వెళ్లేందుకు 8 ప్లాట్ ఫామ్లతో బస్ బే పనులు సాగుతున్నాయి. కొండపైన మొదటి, రెండో ఘాట్రోడ్లు కలిసే ప్రాంతంలో రక్షణ గోడను కలుపుతూ సుమారు 40 ఫీట్ల ఎత్తు, 20 ఫీట్ల వెడల్పుతో రెండు మార్గాలు ఉండేలా చక్కటి స్వాగత తోరణాల నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందుకు కావాల్సిన పిల్లర్లనిర్మాణం చేపట్టారు. దీంతోపాటు మొదటి ఘాట్ రోడ్డు నిత్యన్నదాన సత్రం వద్ద నుంచి నూతనంగా నిర్మించే ఆర్చి వరకు 12 మీటర్ల రోడ్డు వెడల్పు పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొండ కింద లక్ష్మీపుష్కరిణి చెంతన రూ.20.25 కోట్లతో 2.33 ఎకరాల్లో నిర్మిస్తున్న అధునాతన కల్యాణ కట్ట నిర్మాణం చివరి దశకు చేరింది. ప్రస్తుతం భవనానికి ఫ్లోరింగ్, గోడకు రంగులు వేసే పనులు సాగుతున్నాయి. దీక్షాపరుల మండపం, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంతంలో వరద నీరు నిల్వ లేకుండా నేరుగా బయటకు వెళ్లేందుకు ప్రత్యేకమైన కాల్వను నిర్మిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న కాల్వ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతోపాటు కాల్వ పక్కనే విద్యుత్ వైర్ల కోసం ప్రత్యేకంగా చేపట్టిన కాల్వ పనులు పూర్తికావచ్చాయి. స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న గిరిప్రదక్షిణ రోడ్డు పనులు చివరి దశకు చేరుకున్నాయి. లక్ష్మీపుష్కరిణి పక్కనే నిర్మిస్తున్న బస్ టెర్మినల్ పనులను అధికారులు ప్రారంభించారు. సుమారు 5 ఎకరాల్లో 10 ప్లాట్ ఫామ్లు నిర్మించే విధంగా సోమవారం సర్వే చేపట్టారు. మూడు నెలల్లోపు పనులను పూర్తి చేస్తామని వైటీడీఏ అధికారులు వెల్లడించారు.