కొండపోచమ్మ నుంచి పరుగులుపెడుతున్న గోదావరి జలాలు
పసుపు, కుంకుమలు సమర్పించిమంగళహారతులు ఇస్తున్న ప్రజలు
గంగమ్మను చూసిసంబరపడుతున్న రైతన్నలు
తుర్కపల్లి, మార్చి26: గోదావరి పరవళ్లతో కరువు నేల పులకిస్తున్నది. సమైక్యపాలనలో ప్రకటనలకే పరిమితమైన ప్రాజెక్టు పూర్తయి 60 ఏండ్ల కల నెరవేరడంతో పాటు నేడు పనులు పూర్తై బీడు భూములు తడిచి పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని అపర భగీరథుడిగా మారాడు. కొండపై ఉన్న గోదావరి జలాలు తరలిరావడంతో చెరువులు, కుంటలు నిండాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద 10రోజుల క్రితం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి గేట్లను ఎత్తి నీళ్లను విడుదల చేశారు. కాల్వల ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువుల్లోకి గోదావరి జలాల చేరుకున్నాయి. తరలివస్తున్న నీటితో గోపాల్పురం గ్రామ పరిధిలో ఉన్న పోచమ్మచెరువు, పొట్టోనికుంట, మల్లయ్యకుంట, నాగాయపల్లిచెరువు, చిన్నలక్ష్మాపూర్ గ్రామంలోని దాపల్చెరువు, నల్లకుంట, ఎర్రకుంట, ఊరచెరువులు నిండి అలుగులుపోస్తుండగా మాదాపురం గ్రామంలోని జగ్గయ్యచెరువు నుంచి వస్తున్న నీటితో కొత్తచెరువు సైతం నిండి అలుగుపారుతున్నది. మండుటెండల్లో గోదావరి జలాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పదిహేను వందల ఎకరాల్లో వరిసాగు
గోదావరి జలాల రాకతో గోపాల్పురం, చిన్నలక్ష్మాపురం, నాగాయపల్లి, మాదాపురం గ్రామాల పరిధిలో దాదాపు 1500 ఎకరాల్లో వరి సాగులోకి వచ్చిందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. గోపాల్పురంలో గత సంవత్సరం 227 ఎకరాల్లో రైతులు వరిసాగుచేయగా ఈ సంవత్సరం 247 ఎకరాల్లో సాగుచేశారు. అదే విధంగా చిన్నలక్ష్మాపురంలో గత ఏడాది 325 ఎకరాలు సాగుచేయగా ఈ సంవత్సరం 403, నాగాయపల్లిలో గత సంవత్సరం 81ఎకరాలు, ఈ సంవత్సరం 168 ఎకరాలు, మాదాపురంలో గత సంవత్సరం 702 ఎకరాలు, ఈ సంవత్సరం 753 ఎకరాల్లో వరి సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
గంగమ్మకు పూజలు
మండలంలోని గోపాల్పురం, చిన్నలక్ష్మాపురం గ్రామాల్లోని చెరువులు నిండి మత్తడి దూకడంతో గ్రామస్తులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో అలుగుల వద్ద రైతులు, నాయకులు గంగమ్మకు పసుపు, కుంకుమలు సమర్పించి పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి మండలంలోని ఆయాగ్రామాల్లోని చెరువులకు నీళ్లు రావడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.