నీలగిరి, అక్టోబర్ 23 : నల్లగొండ జిల్లాను గంజాయి రహితంగా మార్చడం ద్వారా మత్తుతో నిర్వీర్యమవుతున్న యువత భవితను కాపాడడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని డీఐజీ, జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆదేశించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గంజాయి విక్రయం, రవాణా, వినియోగంపై సీఎం కేసీఆర్ సీరియస్గా ఉన్నారని తెలిపారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంత యువతకు కూడా గంజాయి అందే స్థాయికి విక్రయాలు పెరిగాయన్నారు. గంజాయి విక్రయం, సేవించడం వంటి సమాచారం తెలుసుకునేలా ప్రజలతో మమేకం కావాలన్నారు. గంజాయి కేసులను అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కేసుల నమోదు, విచారణ, సెక్షన్లు, పాటించాల్సిన నిబంధనలు, కోర్టులో సమర్పించాల్సిన పత్రాలు వంటి వాటిపై జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి వేణు పోలీసులకు వివరించారు.
ఏఓబీ ఆపరేషన్లో పాల్గొన్న టాస్క్ఫోర్స్ సిబ్బందికి అభినందన
గంజాయి ముఠాను పట్టుకునేందుకు ఏఓబీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలకు తెగించి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్, పోలీస్ బృందాలను ఎస్పీ అభినందించారు. విధి నిర్వహణ పట్ల నిబద్ధతతో వ్యవహరించి నల్లగొండ పోలీసు సత్తాను చాటారని పేర్కొన్నారు. గంజాయి విషయంలో సమర్థవంతంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రస్థాయిలో డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో త్వరలో ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నదని వివరించారు. సమావేశంలో డీటీసీ ఎస్పీ సతీశ్, అదనపు ఎస్పీ సి.నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, ఆనంద్రెడ్డి, వెంకటేశ్వర్రావు, రమణారెడ్డి, సురేశ్కుమార్, సీఐలు బాలగోపాల్, చంద్రశేఖర్రెడ్డి, రౌతుగోపి, నాగరాజు, పీఎన్డీ ప్రసాద్, శంకర్రెడ్డి, మధు, శ్రీనివాస్, గౌరునాయుడు, వెంకటేశ్వర్లు, సత్యం, రాఘవులు, ఆర్ఐలు నర్సింహాచారి, స్పర్జన్రాజ్, ఎస్ఐలు రాజశేఖర్రెడ్డి, నర్సింహులు, విజయ్కుమార్, నాగరాజు, యాదయ్య, సుధీర్, నర్సింహారావు, శివకుమార్, పరమేశ్ పాల్గొన్నారు.