రామగిరి, అక్టోబర్ 23 : తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నత విద్యలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. మారుతున్న కాలానికి అనుగుణంగా యూజీ, పీజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి తెచ్చాం. సీఎం కేసీఆర్ విజన్తో తెలంగాణ విద్యావ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి అన్నారు. టీఎస్పీఈసెట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. దేశంలోనే విద్యాహబ్గా హైదరాబాద్ నిలుస్తున్నదన్నారు. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు దేశానికి తలమానికంగా ఉండే అనేక యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు ఉన్నాయన్నారు. ఇవన్నీ ఉన్నత విద్యామండలితో కలిసి ముందుకు సాగుతున్నాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ తీసుకొచ్చిన ఐటీహబ్ కూడా ఎంతో ముఖ్యమైందన్నారు. కొత్త జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఉన్నత విద్యామండలి నాణ్యమైన విద్యఅందేలా కృషి చేస్తుందన్నారు. డిగ్రీలో బకెట్ సిస్టమ్తో విద్యార్థులకు కోర్సుల ఎంపికలో సౌలభ్యం కల్పించినట్లు తెలిపారు. ఎన్సీటీఈ ఆదేశాలతో రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల బీఈడీ కోర్సు అందుబాటులోకి వస్తోందని, ఇప్పటికే రాష్ట్రంలోని పలు కళాశాలలు ఈ కోర్సు నిర్వహణకు ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ఉన్నత విద్యలోకి వచ్చిన బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి రీయింబర్స్మెంట్ చెల్లిస్తుందన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొత్తగా ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుత వీసీ ప్రొ॥ గోపాల్రెడ్డి వర్సిటీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అందుకే ఐదు సంవత్సరాలుగా టీఎస్ పీఈసెట్ నిర్వహణ అప్పగించినట్లు చెప్పారు. ఇక్కడి టీం వర్క్ బాగుందని వర్సిటీ బోధన సిబ్బంది, డిపార్టుమెంట్స్ పనితీరును అభినందించారు. ఆయన వెంట ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొ. వి.వెంకటరమణ, ఎంజీయూ వీసీ ప్రొ. సీహెచ్. గోపాల్రెడ్డి ఉన్నారు.