ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగనుండగా ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాల్లో 7,523 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్తోపాటు శానిటైజర్ను అందుబాటులో ఉంచనున్నారు.
భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 22 : ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ఈ నెల 25నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహించేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతిందేచి లేదని స్పష్టం చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాలను ఏర్పాటు చేయగా 7,523 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు అన్ని చర్యలు చేపట్టారు. ఆయా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 144సెక్షన్ అమలులో ఉంచడంతో పాటు, పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా హాల్ లోకి ఎలక్ట్రికల్ వస్తువులు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు..
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 44పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల వసతులు సమకూర్చినట్లు అధికారులు వెల్లడించారు. భువనగిరి డివిజన్లో 12పరీక్షా కేంద్రాలు, ఆలేరు 4, యాదగిరిగుట్ట 2, మోత్కూరు 3, రాజాపేట 1, తుర్కపల్లి 1, బొమ్మలరామారం 2, రామన్నపేట 3, వలిగొండ 3, చౌటుప్పల్ 8, భూదాన్పోచంపల్లి 2, సంస్థాన్నారాయణపూర్లో 3 చొప్పున మొత్తం 44పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలను పూర్తిచేశారు.
పరీక్షా కేంద్రాల పెంపు…
కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచారు. గతంలో 27కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 44ఏర్పాటు చేశారు. కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కు ధరించడంతో పాటు శానిటైజర్ను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
అన్ని ఏర్పాట్లు చేపట్టాం..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి కేంద్రం వద్ద విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేపట్టనున్నాం. విద్యార్థులు మాస్కు ధరించడంతో పాటు శానిటైజర్ను వెంట తెచ్చుకోవాలి. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించేది లేదు. గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి.