యాదాద్రి, అక్టోబర్ 22 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శుక్రవారం ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం ద్వారా శ్రీవారిని, సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను వీక్షించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. ఆలయంలో రూ.100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనారసింహుడి సన్నిధిలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. శ్రీవారి ఖజానాకు శుక్రవారం రూ. 7,11,736 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
లాలిపాటల కోలాహలం
బాలాలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 64,220
రూ.100 దర్శనం టిక్కెట్ 30,000
నిత్య కైంకర్యాలు 400
సుప్రభాత సేవ 600
వేద ఆశీర్వచనం 5,160
క్యారీబ్యాగుల విక్రయం 2,000
టెంకాయల విక్రయం 40,500
వ్రత పూజలు 23,500
కల్యాణకట్ట టిక్కెట్లు 16,200
ప్రసాద విక్రయం 3,12,210
శాశ్వత పూజలు 18,000
వాహన పూజలు 6,800
టోల్గేట్ 840
అన్నదాన విరాళం 3,087
సువర్ణ పుష్పార్చన 81,900
యాదరుషి నిలయం 49,730
పాతగుట్ట నుంచి 18,615
గోపూజ 450
ఇతర విభాగాలు 37,524