చౌటుప్పల్, అక్టోబర్ 21: సకాలంలో వర్షాలు.. పుష్కలంగా భూగర్భ జలాలు, నిరంతర ఉచిత విద్యుత్ .. వెరసి చౌటుప్పల్ పరిధిలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి సాగైంది. ప్రస్తుతం కోతలు మొదలవ్వడంతో చౌటుప్పల్ మార్కెట్ యార్డు మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది. మున్సిపాలిటీ పరిధిలోని చౌటుప్పల్, తంగడపల్లి, లక్కారంతో పాటు మండలంలోని ధర్మోజీగూడెం, దామెర గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొచ్చి యార్డులో ఆరబెడుతున్నారు. త్వరలో కొనుగోళ్లు ప్రారంభం కానున్న తరుణంలో ధాన్యం రాక మొదలైంది. గతేడాది 9వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. ఈ ఏడాది 18 నుంచి 20వేల క్వింటాళ్ల వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. వచ్చిన ధాన్యం వచ్చినట్టుగా 67వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు విశ్రాంతి హాల్ను అందుబాటులోకి తెచ్చారు.
త్వరలో ధాన్యం కొనుగోలు..
ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది పెద్ద ఎత్తున ధాన్యం వస్తుందని అంచనాలు ఉన్నందున ఆ మేరకు సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.