WPI inflation | హోల్సేల్ ద్రవ్యోల్బణం కాసింత శాంతించింది. ఐదు నెలల కనిష్ఠ స్థాయికి దిగి వచ్చింది. ఆహార, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో జూలై టోకు ద్రవ్యోల్బణం 13.93 శాతంగా నమోదైంది. హోల్సేల్ ద్రవ్యోల్బణం దిగి రావడం వరుసగా రెండోసారి. మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 15.88 శాతంగా ఉంటే, జూన్లో 15.18 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో హోల్సేల్ ద్రవ్యోల్బణం 13.43 %. గతేడాది జూలైలో 11.57 శాతం. వరుసగా రెండు నెలలుగా దిగి వస్తున్నా.. 2021 ఏప్రిల్ నుంచి హోల్సేల్ ద్రవ్యోల్బణం వరుసగా 16వ నెల కూడా డబుల్ డిజిట్స్లో కొనసాగుతుండటం ఆందోళనకరం.
జూన్లో ఆహార ఉత్పత్తుల ధరలు 14.33 శాతం ఉంటే జూలైలో 10.77 శాతానికి పడిపోయాయి. జూన్లో 56.75%గా ఉన్న కూరగాయల ధరలు జూలైలో గణనీయ స్థాయిలో 18.25 శాతానికి పతనం అయ్యాయి. అయితే, జూన్లో 40.38 శాతంగా ఇంధన, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం ఉంటే, జూలైలో 43.75 శాతానికి పెరిగాయి.
అయితే, రిటైల్ ద్రవ్యోల్బణం ప్రాతిపదికన ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్షలో నిర్ణయాలు తీసుకుంటుంది. జూలైలోనూ చిల్లర ద్రవ్యోల్బణం దిగి వచ్చినా 6.71 శాతంతో వరుసగా ఏడో నెలలో ఆర్బీఐ పరిమితిని మించే నమోదైంది. ఏప్రిల్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ఇప్పటి వరకు ఆర్బీఐ రెపోరేట్ 140 బేసిక్ పాయింట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్బీఐ రెపోరేట్ 5.40 శాతానికి చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చిల్లర ద్రవ్యోల్బణం సగటున 6.7 శాతానికి చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తున్నది.