సికింద్రాబాద్ : బోనాల వేడుకల సందర్భంగా హైదరాబాద్ జంటనగరాల్లోని పలు ఆలయాల్లో ఆదివారం ఉప సభాపతి టీ పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంటోన్మెంట్ బలంరాయి దండు మారెమ్మ ఆలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ పక్షాన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీతాఫల్మండి పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార్నాకలోని ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు.
ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలు బయటపడాలని, సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. బోనాల వేడుకలను ప్రజలు సంప్రదాయబద్దంగా నిర్వహించుకునేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.