కీవ్: జపొరిజియా అణు కేంద్రం రేడియేషన్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. గురువారం రోజు యూరోప్ దేశాలు దాదాపు రేడియేషన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆ న్యూక్లియర్ ప్లాంట్ రష్యా సైనికుల ఆధీనంలో ఉన్నా.. దాంట్లో మాత్రం ఉక్రెయిన్ సిబ్బంది పనిచేస్తోంది. అయితే ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ నుంచి న్యూక్లియర్ ప్లాంట్ను డిస్కనెక్ట్ చేసినట్లు అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు. ప్లాంట్లో వచ్చిన మంటల వల్ల ఓవర్హెడ్ పవర్ లైన్స్ ధ్వంసమైనట్లు ఆయన చెప్పారు. ఒకవేళ డీజిల్ జనరేటర్లు ఆన్ చేయకుంటే, ఒకవేళ బ్లాక్ఔట్ సమయంలో తమ సిబ్బంది సరైన సమయానికి స్పందించకుంటే, ఇప్పటికే రేడియేషన్ ప్రమాదం జరిగి ఉండేదని జెలెన్స్కీ వార్నింగ్ ఇచ్చారు. పవర్ లైన్స్కు మంటలు వ్యాపించడం వల్ల న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాదంలో పడినట్లు ఆయన చెప్పారు. దీని వల్ల చరిత్రలో తొలిసారి జాతీయ గ్రిడ్ నుంచి జపొరిజియా అణు కేంద్రాన్ని తాత్కాలికంగా వేరు చేయాల్సి వచ్చిందని జెలెన్స్కీ తెలిపారు.