ఒకరి రక్తంతో ముగ్గురికి ప్రాణం
పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాల నిర్వహణ
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ఖలీల్వాడి, జూన్ 13 : రక్తం.. శరీరానికి ఇంధనంలాంటిది.. జీవన విధానం, పౌష్టికాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి మందగించడం, ప్రమాదాల్లో గాయపడి రక్తస్రావం ఏర్పడినప్పుడు రక్తం కొరత ఏర్పడుతున్నది. ఆ లోటును పూడ్చేందుకు ఒకే ఒక్క అవకాశం.. రక్తం ఎక్కించడం. రక్తదానం చేసేవాళ్లు ఉంటేనే అత్యవసర పరిస్థితుల్లో ఇంకొకరి ప్రాణం కాపాడొచ్చు. ఆరోగ్య సమాజం కోసంఇప్పుడు రక్తదాతలు అవసరం. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం…
రక్తం ప్రాధాన్యం తెలిపేందుకు, రక్తదానంపై అవగాహన పెంచడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. సకాలంలో చేసే రక్తదానం ఓ నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా మంచి సందేశం ఇచ్చింది. “డోనేటింగ్ బ్లడ్ ఈజ్ ఎన్ యాక్డ్ ఆఫ్ సాలిడేరిటీ.. జాయిన్ ద ఎఫర్ అండ్ సేవ్ లైఫ్స్” అనేది ఈ సంవత్సరం నినాదం.
ఎవరు చేయొచ్చు..
ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 60 ఏండ్లలోపు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయ్యొచ్చు. కొందరు ఒక్కసారి రక్తం ఇవ్వడానికే భయపడిపోతుంటారు. కానీ ఒక వ్యక్తి తన జీవితకాలంలో దాదాపు 168సార్లు రక్తదానం చేయ్యొచ్చు. మత్తు మందులకు అలవాటుపడినవారు, హెపటైటిస్ బీ, సీ, హెచ్ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్నవారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రక్తం ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరు నెలలు, పురుషులు మూడు నెలల తర్వాతే రెండోసారి రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. శరీర బరువు సగటున 45 కేజీలున్నవారు రక్తదానం చేయవచ్చు. వీరిలో హిమోగ్లోబిన్ కనీసం 12.5 గ్రాములు ఉంటేనే రక్తదానం చేయాలి.
ముగ్గురికి ప్రాణం పోయవచ్చు..
ఒక వ్యక్తి దానం చేసే రక్తం.. ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని డబ్ల్యూహెచ్వో సూచిస్తున్నది. రక్తం ఇవ్వగానే దాన్ని వివిధ కాంపోనెంట్లుగా విభజిస్తారు. దాత నుంచి సేకరించే రక్తాన్ని హోల్బ్లడ్ అంటారు. ఆ రక్తంలో ప్లాస్మా, ప్లేట్లెట్స్, తెల్లరక్తకణాలు, ఎర్ర రక్తకణాలు కలసిన ద్రవం వంటివన్నీ ఉంటాయి. ఒక హోల్ బ్లడ్ను కనీసం మూడు రకాల కాంపోనెంట్లుగా విడదీస్తారు. అప్పుడు ఒక్కరి రక్తమే కనీసం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. దీనిని మరిన్ని కాంపోనెంట్లుగా విడదీసే అవకాశం ఉంటే మరికొందరి ప్రాణాలు కాపాడుతుంది.
రక్తదానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు
వాస్తవాలు..
73సార్లు రక్తదానం చేశా..
రక్తదానం చేయడంతో ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పటి వరకు 73సార్లు రక్తదానం చేశాను. రెడ్క్రాస్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాదాపు 200లకు పైగా శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వారికి రక్తాన్ని అందించాం.
-తోట రాజశేఖర్, రెడ్క్రాస్ జాతీయ కార్యవర్గసభ్యుడు
సమాచారం వచ్చిన వెంటనే స్పందిస్తాం..
మావి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువకులంతా కలిసి రక్తదానం చేస్తున్నాం. ఇప్పటి వరకు 13సార్లు రక్తదానం చేశాను. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాం. రక్తదానం చేసి రెడ్క్రాస్ ద్వారా గర్భిణులకు, రక్తం అవసరం ఉన్నవారికి అందిస్తాం.
– ఆదిత్యఠాకూర్, మావి ఫౌండేషన్ సభ్యుడు