హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించేదాకా తెలంగాణకు నీరు లేదు.. నోరూ లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ గోసపడ్డదని చెప్పారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాతే మన ప్రజలకు దక్కాల్సిన గౌరవం దక్కిందని అన్నారు. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ నేల మీద పురుడుపోసుకున్న టీఆర్ఎస్.. దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రస్థానంలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిందని తెలిపారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన పార్టీ ప్లీనరీ, వరంగల్ విజయగర్జన సభల నియోజకవర్గాలవారీ సన్నాహక సమావేశాల్లో పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు.
మెదక్, అందోల్ నర్సాపూర్, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్, జగిత్యాల, మంథని, వేములవాడ, మానకొండూర్, భువనగిరి, ఆలేరు, మునుగోడు, కోదాడ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్యకర్తలు గులాబీ జెండాను భుజాలపై మోస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిషరించే దిశగా సీఎం కేసీఆర్ అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలను పార్టీకి దగ్గర చేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు నోరు, నీరు లేకుండాపోయిందని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాతే మన ప్రజలకు గౌరవం దకిందని చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 105 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడం గొప్ప విషయమన్నారు. 32 జిల్లా పరిషత్తులకు 32 గెలుపొందడం టీఆర్ఎస్ పనితీరుకు నిదర్శమని చెప్పారు.
గులాబీ దుస్తులు వేసుకొని రావాలి
తెలంగాణ విజయగర్జన బహిరంగసభను విజయవంతం చేయటానికి ప్రతీ గులాబీ కార్యకర్త సైనికుడిగా ముందు వరుసలో నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్లో విజయగర్జన సభకు బయలుదేరే ముందు ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించాలని సూచించారు. ప్లీనరీకి ప్రతి ఒక్కరూ గులాబీ దుస్తులు వేసుకొని రావాలని, ఆహ్వానించిన వారు మాత్రమే రావాలని సూచించారు. నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జన ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, ప్రజలు వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యమ్రంలో పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, జగదీశ్రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, లింగయ్యయాదవ్, వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
600 ఎకరాల్లో విజయగర్జన సభ
టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చేనెల 15న వరంగల్లో నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభాస్థలి ఎంపిక పూర్తయింది. దీనిపై రెండుమూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చు. వరంగల్ జిల్లా ఉర్సు-న్యూ శాయంపేట, అమ్మవారిపేట-భట్టుపల్లి శివారు ప్రాంతాల్లోని దాదాపు 600 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. హైదరాబాద్-ఖమ్మం రోడ్ వయా ఉర్సుగుట్ట, కరీంనగర్-ఖమ్మం వయా హంటర్రోడ్ ఇరువైపులా సభాస్థలికి వచ్చేందుకు అనువుగా సువిశాల రహదారుల మధ్యన సభా నిర్వహణ, వాహనాల పార్కింగ్కు అనువైన స్థలాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు.
కరీంనగర్-ఖమ్మంరోడ్ వయా హంటర్రోడ్ మార్గంలోని దాదాపు 300 ఎకరాల స్థలంలో సభా ప్రాంగణం, సభాస్థలికి సమీపంలోని భట్టుపల్లి-అమ్మవారిపేట శివారులో, ఉర్సుగుట్ట, జక్కలొద్ది సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఎటు నుంచి వచ్చినా వాహనాలు నిలిపేందుకు అనువుగా దాదాపు 300 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. సభాస్థలి ప్రాంగణంలో దాదాపు 50 ఎకరాల మేర పంట ఉన్నదని, వీటికి పరిహారం చెల్లించే ందుకు గతంలో మాదిరి విధానాన్నే అనుసరిస్తారని సమాచారం.