కార్మిక సంక్షేమం.. కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు
పెద్దలకు అత్యుత్తమ వైద్యం, పిల్లలకు విద్య
కుటుంబాల్లో కారుణ్య నియామక వెలుగులు
మ్యాచింగ్ గ్రాంటు రూ.20 లక్షలకు పెంపు
సొంతింటి కలకు వడ్డీ పథకంతో చేయూత
ఆరేండ్లలో సమూలంగా మారిన ముఖచిత్రం
మసి బొగ్గును తవ్వితీసి రాష్ర్టానికి వెలుగులు అద్దుతున్న నల్లసూర్యుల జీవితాల్లో తెలంగాణ సర్కారు సంతోషాల కాంతులు నింపుతున్నది. ఆరేండ్ల క్రితం వరకు నిస్తేజం, నిస్సత్తువతో ఉన్న సింగరేణి కార్మికుల్లో ఇప్పుడు రెట్టించిన ఉత్సాహం కనిపిస్తున్నది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికుల జీవితాలే మారిపోయాయి. కార్మికుల కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని కూడా సంస్థ బాధ్యతగా తీసుకున్నది. కార్పొరేట్ కంపెనీలకు మించి ఉద్యోగులు, కార్మికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. సంస్థ ప్రగతి, కార్మికుల సంక్షేమమే కర్తవ్యంగా సీఎం కేసీఆర్ చూపిన మార్గంలో ముందుకు సాగుతున్నది. బొగ్గు ఉత్పత్తి, రవాణా, టర్నోవర్, లాభాలు, నియామకాలు.. ఇలా ఎన్నో అంశాల్లో సంస్థ రికార్డులు సృష్టిస్తున్నది.
కరీంనగర్, (నమస్తే తెలంగాణ, ప్రతినిధి)/శ్రీరాంపూర్, మార్చి 1 : దేశంలో ఏ బొగ్గు గనుల సంస్థ సాధించని రీతిలో సింగరేణి 22 శాతం వార్షిక వృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో సీఎండీ శ్రీధర్ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ దేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందుతున్నది. రానున్న నాలుగేండ్లలో 14 కొత్త గనుల ప్రారంభానికి యాజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. మరో 10 వేల కారుణ్య నియామకాలతోపాటు ఇతర క్యాటగిరీ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది.
ఆరేండ్లలో సింగరేణిలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు
తెలంగాణ రాకముందు పదేండ్లలో సింగరేణిలో 6,453 ఉద్యోగాలు ఇవ్వగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేండ్లలో 13,803 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది.
లాభాల్లో బోనస్ 2014లో 18 శాతం ఉండగా, 2015లో 21%, 2016లో 23%, 2017 లో 25%, 2018లో 27%, 2019లో 28% పెంచింది.
గతంలో పండుగ అడ్వాన్స్ రూ.10 వేలే. 2015లో రూ.16 వేలు, 2017లో 25 వేలకు పెంచారు.
కార్మికులు చనిపోతే ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటును 20 రెట్లు పెంచారు. లక్ష నుంచి 20 లక్షలకు పెంచారు.
డిపెండెంట్ ఎంప్లాయిమెంట్, ఎంఎంసీకి బదులు గతంలో ఏకమొత్తంగా రూ.5 లక్షలు చెల్లించేవారు. రూ.25 లక్షలకు పెంచింది.
సొంతింటి నిర్మాణానికి రూ.10 లక్షలలోపు రుణంపై సంస్థే వడ్డీ చెల్లిస్తున్నది. కార్మికులు, వారి తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నది. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో కార్మికుల కాలనీల్లోని క్వార్టర్లకు ఏసీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నది.
కార్మికుల పిల్లల ఐఐటీ, ఐఐఎం ఫీజు చెల్లిస్తున్నది.
మెడికల్ అన్ఫిట్తో జాబ్ వదులుకుంటే ఒకేసారి 25 లక్షలు, లేదా నెలకు రూ.26,293 చెల్లిస్తున్నది.
గతంలో 12 వారాలున్న ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచింది. చైల్డ్కేర్ సెలవులు ఇస్తున్నది.
గనుల్లో క్యాంటీన్ల ఆధునీకరణ. గనుల్లో బాత్రూం లు, అన్ని ఏరియాల్లో స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, పర్యావరణహిత పార్కులను నిర్మిస్తున్నది.
కార్మికుల విద్యుత్తు బిల్లులను సంస్థ రద్దుచేసింది.
ఉద్యోగ విరమణ చేసినవారికి రిటైర్మెంట్ మెడికల్ స్కీం (సీపీఆర్ఎంఎస్)ను అమలు చేస్తున్నది.
4,174 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేసింది.
అంబేద్కర్ జయంతి, రంజాన్, క్రిస్మస్ పండుగ దినాలను సెలవులుగా ప్రకటించింది.
రాష్ట్ర కోసం పోరాడిన కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ కింద రూ.240 కోట్లు చెల్లించింది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏడాదికి రూ.50 కోట్లతో సమీప గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నది.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి 2016 సెప్టెంబర్ నుంచి 2021 జనవరి వరకు 37,958 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. ఇందులో 35,660 మిలియన్ యూనిట్ల విద్యుత్ను రాష్ర్టానికి సరఫరా చేసింది.
సింగరేణి వ్యాప్తంగా 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నది. సింగరేణి థర్మల్ కేంద్రంలో 10 మెగావాట్లు, మణుగూరులో 30, రామగుండంలో 30, ఇల్లందులో 15 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్లను ఇటీవలే ప్రారంభించింది. మొత్తం 85 మెగావాట్ల సోలార్ విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించింది.
సింగరేణి గడిచిన ఆరేండ్లుగా సగటున 22 శాతం వార్షిక వృద్ధి సాధిస్తున్నది.
ఒకేసారి 3,100 మందికి కారుణ్య ఉద్యోగాలు.
స్థానిక యువతకు ఉద్యోగాల్లో 80% రిజర్వేషన్.
రిటైర్డ్ కార్మికుల సన్మానం ఖర్చును రూ.800 నుంచి రూ.3,500 పెంచారు.
కారుణ్య నియమాకాలు.. క్యాష్ నియామకాలు ఎలా ?
సింగరేణిలో 20 ఏండ్లక్రితం రద్దయిన కారుణ్య నియామకాలను తిరిగి ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. కారుణ్య నియామకాలు లేక గతంలో చాలామంది కార్మికులు ఇబ్బంది పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాగానే సింగరేణిలో కారుణ్య నియామకాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ గొప్ప సంకల్పానికి కూడా కొందరు అడ్డుతగిలి కోర్టుల్లో కేసులు వేశారు. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా కారుణ్య నియమాకాలు చేపట్టింది. 2018 మార్చి 9 నుంచి 2021 జనవరి వరకు మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్గా గుర్తింపు పొందిన కార్మికుల పిల్లలకే ఉద్యోగాలిచ్చారు. ఎంతో పారదర్శకంగా జరిగిన ఈ నియామకాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఆరోపణలు చేశారు. మెడికల్ బోర్డు ధ్రువీకరణ ద్వారా జరిగిన నియామకాలు క్యాష్ నియామకాలు ఎలా అయ్యా యో సంజయ్ సమాధానం చెప్పాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.