హైదరాబాద్ : మృతిచెందిన ఏఎస్ఐ మహిపాల్రెడ్డి స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని కూకట్పల్లి పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా రెండు రోజుల కిందట ఓ క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టడంతో గాయపడిన ఏఎస్ఐ మహిపాల్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మృతిచెందారు. మద్యం మత్తులో ఉన్న అస్లాం అనే వ్యక్తి తప్పించుకునే క్రమంలో ఏఎస్ఐ మహిపాల్రెడ్డి, సిబ్బందిపైకి కారు పోనిచ్చాడు. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఏఎస్ఐ ఈ ఉదయం ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు మహిపాల్ రెడ్డి అవయవాలను దానం చేశారు.
ఏఎస్ఐ మృతిపై సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. మద్యం తాగిన డ్రైవర్ నిర్లక్ష్యం ఒక అధికారి ప్రాణం తీసిందన్నారు. క్యాబ్ డ్రైవర్ వేగంగా వచ్చి పోలీస్ సిబ్బందిని ఢీకొట్టాడు. ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి ఘటనతో వెనకడుగు వేసేది లేదన్నారు. మహిపాల్ రెడ్డి స్ఫూర్తిగా మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కచ్చితంగా వ్యవహరిస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లోని సిబ్బంది భద్రతకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.