లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్
విద్యానగర్, మే 29 : విద్యార్థులు కష్టపడి చదివితే సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని జిల్లా కేంద్రం గ్రంథాలయాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలనూ పరిశీలించారు. అనంతరం వివిధ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. సమయాన్ని వృథా చేయకుండా ఎంత కష్టపడితే అంత ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
లక్ష్యం చేరుకునేదాకా చదువుతూనే ఉండాలన్నారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, ప్రణాళిక ప్రకారం చదువుకొని అన్ని విషయాల్లో పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. లైబ్రరీలను ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు.