ముంబై : బంగారం, షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు కంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకే మహిళలు అధికంగా మొగ్గుచూపుతున్నారని తాజా అథ్యయనం వెల్లడించింది. బంగారం సహా ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ప్రాపర్టీలో పెట్టుబడి మేలని 62 శాతం మగువలు అభిప్రాయపడగా, పురుషుల్లో 54 శాతం మంది రియల్ ఎస్టేట్ మెరుగైన పెట్టుబడి వనరని వెల్లడించినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ అథ్యయనం తెలిపింది. ఇక 82 శాతం మహిళలు తాము నివసించేందుకు ఇండ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల కొనుగోలుకు మొగ్గుచూపగా 18 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీ మార్కెట్ వైపు చూస్తామని చెప్పారు.
ఇక పురుషుల్లో 68 శాతం మంది తాము నివసించేందుకు ప్రాపర్టీ కొనుగోలు చేస్తామని చెప్పగా పెట్టుబడి వనరుగా పరిగణిస్తామని 34 శాతం మంది వెల్లడించారు. మరోవైపు ప్రాపర్టీ కొనుగోలుకు ఇదే సరైన సమయమని 70 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. రూ 90 లక్షల లోపు అందుబాటు గృహాలు కొనుగోలు చేస్తామని 66 శాతం మంది వెల్లడించారు. గృహరుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో ఇండ్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నామని సర్వేలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
మరోవైపు 46 శాతం మంది మగువలు త్రిబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొనుగోలుకు ఆసక్తి కనబరచగా 30 శాతం మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇక 10 శాతం మంది నాలుగు పడక గదుల ఇండ్ల వైపు మొగ్గుచూపారు. ఆస్తుల్లో ప్రాపర్టీయే తమకు తొలి ప్రాధాన్యమని 62 శాతం మంది మహిళలు చెప్పారని, పెట్టుబడి వైవిధ్యం కోసం కూడా రియల్ ఎస్టేట్ను పలువురు ఎంచుకుంటున్నారని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ రీసెర్చి హెడ్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు.