న్యూఢిల్లీ: దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలకు ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది. 2019-21లో దేశంలోని 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5ను నిర్వహించారు. 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషుల నుంచి పలు అంశాలపై వివరాలు సేకరించారు.
అయితే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పురుషుల కంటే మహిళల సగటు లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, జమ్ముకశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. రాజస్థాన్లో మహిళలకు అత్యధికంగా సగటున 3.1 మంది లైంగిక భాగస్వామ్యులు ఉండగా, ఆ రాష్ట్రంలో పురుషులకు సగటున 1.8 మంది మాత్రమే సెక్స్ పార్టనర్లు ఉన్నట్లు సర్వేలో తెలిసింది.
మరోవైపు ఈ సర్వే నిర్వహించిన ఏడాది ముందు జీవిత భాగస్వామి లేదా సహజీవనం చేస్తున్న వారితో కాకుండా ఇతరులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులు 4 శాతం ఉండగా, మహిళల సంఖ్య 0.5 శాతంగా ఉంది. కాగా, వ్యక్తుల సామాజిక, ఆర్థిక సమాచారంతోపాటు ఇతర అంశాల వివరాలు కూడా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5లో సేకరించారు.