ప్రెటోరియా : ఒకే కాన్పులో పది మంది సంతానానికి జన్మనిచ్చి వరల్డ్ రికార్డు నెలకొల్పానని కట్టుకధ అల్లిన దక్షిణాఫ్రికా మహిళను సైకియాట్రిక్ వార్డులో చేర్చగా వాస్తవాలు వెలుగుచూశాయి. తొలుత 37 ఏండ్ల గొసైమ్ ధమర సిథోల్ కనిపించడం లేదని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో జూన్ 17న జోహన్స్బర్గ్లోని ఆమె బంధువుల నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై సామాజిక కార్యకర్తల సాయంతో ఆమె మానసిక స్ధితిని అంచనా వేసేందుకు తెంబ్సియా ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగంలో చేర్చారు. కాగా ఒకే కాన్పులో పదిమంది సంతానానికి జన్మనిచ్చన కథను ప్రచారంలో పెట్టి నవజాత శిశువులకు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ మిలియనీర్ కావాలని తన భర్త ప్లాన్ చేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు.
గుటెంగ్ ప్రావియన్స్కు చెందిన మహిళ జూన్ 7న ప్రెటోరియాలోని ఓ దవాఖానలో ఒకే కాన్పులో పది మంది సంతానానికి సహజంగా జన్మనిచ్చానని వెల్లడించారు. తాను ఎనిమిదిమంది సంతానాన్ని ఊహించగా అనూహ్యంగా పది మంది జన్మించారని ఆమె చెప్పారు. అయితే పది మంది సంతానం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆమె వాదనపై పలు సందేహాలు వెల్లడయ్యాయి. పదిమంది శిశువలు జన్మించినట్టు ఆధారాలు లేవని తమ పరిశోధనలో వెల్లడైందని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ కూడా స్పష్టం చేసింది. మరోవైపు మహిళను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధంలోకి తీసుకున్నారని ఆమె విడుదలను కోరుతూ కోర్టు ఉత్తర్వుల కోసం ప్రయత్నిస్తానని మహిళ తరపు న్యాయవాది రెఫెలో మొకోనా పేర్కొన్నారు.