కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కోర్టు ఎదుట గల డ్రైనేజీలో మంగళవారం ఉదయం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభించింది. మృతురాలి వయస్సు 30 ఏళ్లుగా ఉండొచ్చని సమాచారం. అటుగా వెళ్తున్న బాటసారులు డ్రైనేజీలో మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. సీపీ వీబీ కమలాసన్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళను ఎవరో వేరే ప్రాంతంలో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడ పడవేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటాన్ని బట్టి చూస్తే ఆమె కొన్ని రోజులక్రితమే హత్యకు గురై ఉంటుందని పేర్కొన్నారు.