పిల్లలకు పరీక్షలొస్తే నువ్వు ఆందోళన పడతావు. ఫలితాలరోజు వేయి దేవుళ్లకు మొక్కుకుంటావు. జీవిత భాగస్వామి వృత్తి- ఉద్యోగ జీవితంలో విషమ పరీక్షలు ఎదురైనప్పుడూ అంతే. కొంగుబిగించి రంగంలోకి దిగుతావు. నీ వంతు సహకారం అందిస్తావు. సమాజాన్ని కరోనాలాంటి పరీక్షలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు.. అన్నీ నీవై గండం గట్టెక్కిస్తావు. అది నీ సహజ గుణం, స్త్రీ సహజ స్వభావం. కానీ, ఒక్కసా రైనా.. నీ శరీరాన్ని నువ్వు పరీక్షించుకున్నావా?
అద్దం అతివ ప్రియ నేస్తమని చెబుతారు. పొద్దున్నే లేవగానే.. చెదిరిపోయిన కుంకుమ బొట్టును సరిచేసుకోవడం మొదలు, పడుకునే ముందు.. పెదవులకు లిప్బామ్ రాసుకునే వరకూ.. ఇరవైనాలుగు గంటల్లో కనీసం అరడజను సార్లయినా అద్దంలో చూసుకుంటారు. అలంకరణ కోసం సరే. ఆరోగ్యకోణంలో ఎప్పుడైనా చూసుకున్నారా? మీ చర్మాన్ని పరీక్షించుకున్నారా? పాలిపోయినట్టు అనిపిస్తున్నదా, నిర్జీవంగా కనిపిస్తున్నదా? ఇవన్నీ రక్తహీనత లక్షణాలు కావచ్చు. దేశంలో దాదాపు 50 శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భిణుల విషయానికొస్తే.. 70 శాతం మందికి ఈ సమస్య ఉంది. మహిళలకు ప్రతి డెసీలీటరు రక్తంలో కనీసం 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. కానీ మనవాళ్లలో 2-3 గ్రాములు కూడా కనిపించడం లేదు. ఏదో ఓ దశలో ఎనీమియా ప్రాణాంతకంగా మారవచ్చు. చర్మం రంగు మారినట్టు అనిపించినా, మచ్చలు ఏర్పడినట్టు అనుమానం వచ్చినా విస్మరించడానికి వీల్లేదు.
మహిళగా నీకు సౌందర్య స్పృహ ఎక్కువే. రంగురంగుల వస్ర్తాలను ఇష్టపడతావు. రంగురంగుల పువ్వులను ప్రేమిస్తావు. పంచరంగుల చిలుకలను ముద్దాడతావు. కానీ, నీ పళ్లెంలో మాత్రం.. ఒకటో రెండో రంగులే కనబడతాయి ఎందుకు? ఇంద్రధనుస్సులోని వర్ణాలన్నీ కూరలు, కాయలు, కందలు, ధాన్యాల రూపంలో పళ్లెంలో ప్రత్యక్షం అయితేనే.. పరిపూర్ణ ఆరోగ్యమన్న సంగతి నీకు తెలియనిది కాదు. భోజనానికి కూర్చున్న ప్రతీసారి పళ్లాన్ని పరీక్షించుకో? ముఖ్యంగా నువ్వు ఐరన్తో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. పాలు, గుడ్లు, చేపలు, మాంసాహారం నీకు బలాన్నిస్తాయి. చౌకగా లభించే బెల్లం పట్టీలు, పల్లీ పట్టీలు, ఖర్జూరం.. నీ ఒంటికి చాలా మంచిచేస్తాయి. కొవ్వు ఎక్కువగా, ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తింటే దీర్ఘకాలంలో క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంది. పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండే భోజన విధానం ప్రొస్టేట్ క్యాన్సర్కు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అసాధారణంగా బరువు పెరగడం, అనూహ్యంగా బరువు తగ్గడం.. రెండూ ప్రమాద సంకేతాలే. మహిళల్లో ఊబకాయ సమస్య అధికం అవుతున్నది. వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం, కొలెస్ట్రాల్తో కూడిన ఆహారం అధికంగా తీసుకోవడం.. ప్రధాన కారణాలు. బరువు పెరిగేకొద్దీ ప్రాణాంతక రుగ్మతలకు దగ్గర అవుతున్నట్టే. హఠాత్తుగా బరువు తగ్గడమూ దీర్ఘకాలిక రుగ్మతలకు సంకేతమే .. అది మధుమేహం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు. ఆరు నుంచి పన్నెండు నెలలలోపు.. శరీర బరువులో ఐదు శాతానికి మించి తగ్గితే వైద్యులను సంప్రదించాలి.
శరీరంతో సంభాషణ ఓ ఆరోగ్యకరమైన లక్షణం. వంటి మీద ఏ కొత్త మచ్చ పుట్టుకొచ్చినా మీకు తెలిసిపోవాలి. ఏ అవయవం మీద గడ్డ ఏర్పడినా మీ దృష్టికి వచ్చేయాలి. ఏ ప్రాంతంలో కొవ్వు పేరుకుపోయినా మీరు పసిగట్టేయాలి. అతి సాధారణ రుగ్మతలని భావించే నెలసరి లోపాలు, వైట్ డిశ్చార్జ్, కడుపునొప్పి, ఛాతీలో బరువుగా అనిపించడం, లైంగిక కలయిక తర్వాత రక్తస్రావం.. తదితర ఇబ్బందులు దీర్ఘకాలంలో ప్రమాద ఘంటికలు కావచ్చు. మూత్రానికి వెళ్తున్నప్పుడు సమస్యగా అనిపించినా, మూత్రంలో రక్తం కనిపించినా.. ప్రొస్టేట్ క్యాన్సర్గా అనుమానించాలి. వెన్నెముక నొప్పినీ తేలిగ్గా తీసుకోలేం. మూత్రపిండ, ప్రొస్టేట్ క్యాన్సర్కు ఇది తొలి దశ కావచ్చేమో.
కుటుంబసభ్యులకు చిన్నపాటి సమస్య వచ్చినా తల్లడిల్లిపోయే మహిళ.. తన గురించి మాత్రం పట్టించుకోదు. సొంతవైద్యంతోనో, వంటింటి చిట్కాలతోనో సరిపెట్టుకుంటుంది. ఎవరికి తెలుసు.. ఆ సమస్య ఓ రుగ్మతకు మూలం కావచ్చు. ముఖ్యంగా… క్యాన్సర్ మహమ్మారి కోరలుచాచుకుని సిద్ధంగా ఉంటుంది. గడచిన పదేండ్లలో మహిళల్లో క్యాన్సర్ వ్యాధులు రెట్టింపు అయ్యాయి. సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, యుట్రస్ క్యాన్సర్, ఒవరిన్ క్యాన్సర్ .. దేని తీవ్రత దానిదే. కనీసం ఆరునెలలకు ఒకసారి అయినా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారానే .. క్యాన్సర్ మహమ్మారిని తొలి దశలో అడ్డుకోవచ్చు. ‘పాప్స్మియర్’ టెస్ట్తో భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. కొందరు మహిళల్లో అరవై తర్వాత మళ్లీ రక్తస్రావం మొదలవుతుంది. దీన్ని సాధారణ సమస్యగా భావించకూడదు. ‘హిస్ట్రోస్కోపి బయాప్సీ’ ద్వారా క్యాన్సర్ మూలాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఒవరిన్ క్యాన్సర్ లక్షణాలు బయటపడతాయి. థైరాయిడ్ సమస్య కూడా కొన్నిసార్లు గర్భసంచి సర్జరీ వరకూ వెళ్తుంది. ఏటా థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే.. ఆ గండాన్ని గట్టెక్కవచ్చు. అన్నిటికంటే ముందు.. తరచూ బీపీ పరీక్షించుకోవడం అలవాటు చేసుకోవాలి. నెలకోసారి మధుమేహ పరీక్ష చేయించుకోవాలి. ఈ రెండూ సకల రుగ్మతలకూ మూలం. వీటితోపాటు కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా.
బిడ్డ పుట్టినప్పటి నుంచీ ఓ వయసుకు వచ్చేవరకూ.. బాబుకో, పాపకో అవసరమైన అన్ని టీకాలు వేయించే తల్లి, తనకూ కొన్ని టీకాలు అవసరం అన్న సంగతి మరచిపోతుంది. అంతెందుకు, నూటికి తొంభై శాతం కుటుంబాల్లో చిట్టచివరి కొవిడ్ టీకా మహిళదే అయి ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నలభై ఏండ్లలోపే సర్విక్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ‘రుబెల్లా’ వ్యాక్సిన్ ద్వారా పుట్టబోయే బిడ్డల్లో జన్యు లోపాలను నివారించవచ్చు. న్యుమోనియా, మెనింజైటిస్, రక్త ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే టీకాల గురించి కూడా వైద్యులను అడగాలి. కొన్నిసార్లు జీవిత భాగస్వామి ద్వారా ప్రాణాంతక వ్యాధులు సంక్రమించవచ్చు. అవసరమైతే, నిపుణుల సలహాతో హెచ్ఐవీ పరీక్షలూ చేయించుకోవచ్చు.
డాక్టర్ రాజేశ్వరి
ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ, ఒబిజివై డిపార్ట్మెంట్
నిలోఫర్ హాస్పిటల్, హైదరాబాద్