రామానంద సాగర్ నిర్మించిన రామాయణ్ 80 వ దశకంలో టీవీ రంగంలో కొత్త చరిత్ర సృష్టించింది. రామాయణ్ సీరియల్లో నటించిన శ్రీరాముడు, సీత, లక్ష్మణులను నిజమైన దేవతామూర్తులుగా భావించిన ప్రేక్షకులు చాలా మంది వారికి హారతులిచ్చి నీరాజనాలు పలికారు. ఇన్నేండ్లయినా రామాయణ్ రాముడికి ఆదరణ తగ్గిపోలేదని తాజాగా ఎయిర్పోర్ట్లో శ్రీరాముడి పాత్రధారి అరుణ్ గోవిల్కు సాష్టాంగపడిందో మహిళ.
రామాయణ్ సీరియల్ దేశమంతా ప్రభంజనం సృష్టించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మరోసారి రామాయణ్ సీరియల్ను టీవీలో ప్రదర్శించారు. ఈ సీరియల్లో నటించిన పాత్రధారులందరికీ ఏ చోటకెళ్లినా జనం నీరాజనాలు పట్టారు. తాజాగా విమానాశ్రయం నుంచి కుటుంబసమేతంగా బయటకు వస్తున్న శ్రీరాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ను ఓ మహిళ చూసింది. వెంటనే వెళ్లి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఈ చేష్టతో అరుణ్ గోవిల్ నిశ్చేష్టుడయ్యాడు. కొద్దిసేపు మాటరాక మౌనంగా నిలబడిపోయాడు. తేరుకుని తన వద్ద ఉన్న పసుపు రంగు దుపట్టాను ఆ మహిళకు అందించి పులకించిపోయాడు.
आपकी छवि क्या है औरों के हृदय में उससे ही आपकी महानता है।रामायण टीवी धारावाहिक को 35 वर्ष हो गए पर राम का चरित्र निभाने वाले अरुण गोविल आज भी सबके लिए प्रभु श्रीराम ही हैं। भावुक कर देने वाला क्षण। @arungovil12 pic.twitter.com/4nM979xQl3
— Dr Sumita Misra IAS (@sumitamisra) September 30, 2022
గత నెల 30 వ తేదీన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోనొకదాన్ని ఐఏఎస్ అధికారి డాక్టర్ సుమిత మిశ్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇతరుల హృదయాల్లో నీ ఇమేజ్ ఏంటి? అదే నీ గొప్పతనం. రామాయణం టీవీ సీరియల్ వచ్చి 35 ఏండ్లు దాటిపోతున్నా.. రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్ మాత్రం ఇప్పటికీ అందరికీ శ్రీరాముడిగానే ఉన్నారు. ఇది నాకెంతో భావోద్వేగ క్షణం అంటూ అమె తన మనోభావాన్ని అక్షరబద్దం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 వేల మంది వీక్షించి కొంగొత్త అనుభూతికి లోనయ్యారు.