భోపాల్: లైంగిక వేధింపులను ప్రతిఘటించిన మహిళను ఒక వ్యక్తి కదులుతున్న రైలు నుంచి బయటకు తోసివేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఉత్తర ప్రదేశ్ బండా జిల్లాకు చెందిన 25 ఏండ్ల మహిళ, మధ్యప్రదేశ్ ఛత్తర్పూర్ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ ఆలయం సందర్శనకు వెళ్లింది. అనంతరం ఈ నెల 27న ఉత్తరప్రదేశ్లోని సొంతూరుకు రైలులో తిరుగు ప్రయాణమైంది.
కాగా, రాత్రి వేళ ఒక ప్రయాణికుడు ఆ మహిళను లైంగికంగా వేధించాడు. ఆమె ప్రతిఘటించడంతో మధ్యప్రదేశ్లోని ఖజురహో, ఉత్తప్రదేశ్లోని మహోబా మధ్య రాజ్నగర్ ప్రాంతంలో కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఛత్తర్పూర్ జిల్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు జబల్పూర్ ప్రభుత్వ రైల్వే పోలీస్ ఎస్పీ వినాయక్ వర్మ తెలిపారు. ఖజురహో పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి చర్య కోసం రేవా జీఆర్పీకి బదిలీ చేసినట్లు చెప్పారు. నిందితుడ్ని గుర్తించామని, అతడ్ని అరెస్ట్ చేసే పనిలో పోలీసులున్నారని వెల్లడించారు.