చండీగఢ్: అసభ్య ప్రవర్తనపై మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఒక వ్యక్తి ఆమెను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది. హర్యానాలోని తోహానాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల మన్దీప్ కౌర్, 9 ఏళ్ల కుమారుడితో కలిసి పుట్టిన ఊరైన రోహ్తక్లోని కరంతి గ్రామం నుంచి భర్త ఊరైన తోహానాకు గురువారం రాత్రి రైలులో బయలుదేరింది.
సందీప్ అనే యువకుడు నర్వానా స్టేషన్లో ఆ రైలు ఎక్కాడు. అనంతరం మన్దీప్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసి వారించింది. దీంతో కదులుతున్న రైలు నుంచి ఆమెను తోసేశాడు. అనంతరం ఆ యువకుడు కూడా రైలు నుంచి దూకాడు. గాయపడిన అతడు వైద్య కాలేజీ ఆసుపత్రిలో చికిత్స తర్వాత కాల్వన్లోని తన ఇంటికి వెళ్లిపోయాడు.
మరోవైపు మన్దీప్ భర్త హర్జిందర్, తన భార్య, కుమారుడి కోసం తోహానా రైల్వే స్టేషన్కు వచ్చాడు. అయితే ఒక్కడే రైలు దిగిన కుమారుడు ఏడుస్తూ జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పాడు. దీంతో హర్జిందర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రాత్రి మన్దీప్ కోసం గాలించారు. తీవ్రంగా గాయపడి మరణించిన ఆమె మృతదేహం లభించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు సందీప్ను శుక్రవారం అరెస్ట్ చేశారు.