లక్నో: ఒక మహిళను ఆమె ప్రియుడు కొట్టాడు. అనంతరం ఆమెతోపాటు పిల్లలను కిడ్నాప్ చేసి మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన బంధువుల సహాయంతో మహిళతోపాటు ఆమె పిల్లలను నదిలోకి తోసేశాడు. అయితే ఒక వ్యక్తి ఆమెను కాపాడగా పిల్లలు మాత్రం చనిపోయారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
సయారా అలియాస్ రజని అనే మహిళ భర్త 2019లో ప్రమాదంలో మరణించాడు. అప్పటికే వారికి ఒక పాప ఉండగా భర్త చనిపోయినప్పుడు ఆమె గర్భందాల్చింది. కాగా, మహేష్ అనే వ్యక్తి ద్వారా సోను యాదవ్ అలియాస్ భోలు అనే వ్యక్తి సయారాకు పరిచయం అయ్యాడు. గురుగ్రామ్లో పిజ్జా డెలివరీ బాయ్గా పని చేస్తున్న అతడితో కలిసి సహజీవనం చేసిన ఆమె మూడు నెలల తర్వాత ఒక బాబుకు జన్మనిచ్చింది.
అయితే ఫిబ్రవరి 27న సయారాతో గొడవపడిన సోను, రవిత అనే మహిళతో కలిసి ఆమెను కొట్టాడు. అనంతరం రాత్రి వేళ తన బంధువులతో కలిసి సయారా, ఆమె ఇద్దరు పిల్లలను బలవంతంగా కారులో మీరట్ వైపునకు తీసుకెళ్లారు. సరిహద్దు ప్రాంతంలోని కాలువలో ఆ ముగ్గురిని తోసేశారు.
అయితే ఒక వ్యక్తి సయారాను రక్షించగా మార్చి 2న ఆమె గురుగ్రామ్కు చేరుకున్నది. తన పిల్లల జాడ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ నదిలో తేలిన పిల్లల మృతదేహాలను గుర్తించారు. సోను యాదవ్తోపాటు అతడి బంధువులైన రవిత, ప్రదీప్ అలియాస్ గొల్లు, సచిన్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.