న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఇంటి ముందు లొల్లి పెట్టొద్దన్నందుకు నలుగురు యువకులు ఓ మహిళను, ఆమె కొడుకును కత్తులతో పొడిచి పారిపోయారు. పశ్చిమ ఢిల్లీలోని పంజాబ్ బాగ్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనలో తల్లీకొడుకులు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం మధ్యాహ్నం బాధితుల ఇంటిముందు నలుగురు యువకులు లొల్లిలొల్లిగా మాట్లాడుతున్నారు. దాంతో మొయిన్ (19), అతని తల్లి (40), తండ్రి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దాంతో ఆ యువకులు వారితో గొడవకు దిగారు. మాటామాటా పెరుగడంతో మొయిన్పైన, అతని తల్లిపైన యువకులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో మొయిన్ తల్లికి ఛాతిలో, మొయిన్కు తొడపై బలమైన గాయాలు అయ్యాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితులను దీన్దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లీకొడుకులపై దాడికి పాల్పడ్డ నిందితులు నలుగురూ 18 ఏండ్ల లోపువారేనని తేలిందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.