న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ 22 ఏండ్ల మహిళ దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు పసిబిడ్డలను (ఒక కొడుకు, ఒక బిడ్డ) ఫ్యాన్కు ఉరేసి చంపి, అనంతరం తానూ అదే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఢిల్లీ వాయవ్య ప్రాంతంలోని షాకూర్పూర్ ఏరియాలో గురువారం రాత్రి ఈ ఘటన వెలుగుచూసింది. భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదన్న కోపంతోనే ఆమె ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్కు చెందిన యువ దంపతులు కొన్నేండ్ల క్రితం బతుకుదెరువు కోసమని దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి షాకూర్పూర్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. వారికి ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. భర్త స్థానికంగా ఓ రెస్టారెంట్లో పనిచేస్తుండగా, భార్య ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నది. అయితే ఇటీవల బీహార్ రాష్ట్రం, మధుబని జిల్లాలోని తమ స్వగ్రామంలో ఒక మతపరమైన శుభాకార్యం జరుగుతున్నట్లు వారికి కుటుంబసభ్యుల నుంచి కబురు వచ్చింది.
దాంతో తాను ఆ శుభకార్యానికి వెళ్తానని భార్య భర్తను కోరింది. అందుకు అతడు అంగీకరించకపోవడంతో గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం భర్త ఉద్యోగానికి వెళ్లిపోయాడు. అయితే ఆ గొడవతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య పసివాళ్లయిన తన ఇద్దరు పిల్లలను ఫ్యాన్ ఉరిబిగించి చంపింది. ఆ తర్వాత తాను కూడా అదే ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది.
రాత్రి 10.30 గంటలకు డ్యూటీ నుంచి వచ్చిన భర్త తలుపు ఎంత తట్టినా తీయకపోవడంతో కిటిలోంచి చూశాడు. లోపల ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన భార్యాపిల్లలను చూసి ఒక్కసారిగా గావుకేకలు పెట్టాడు. అనంతరం ఇరుగుపొరుగుతో కలిసి తలుపులు బద్దలుకొట్టి వారిని కిందికి దించారు. అయితే అప్పటికే చనిపోయారని నిర్ధారించుకుని పోలీసులకు సమచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.