న్యూఢిల్లీ : ప్రియుడి సాయంతో 2011లో భర్తను హత్య చేసిన మహిళను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితురాలిని శకుంతల (28)గా గుర్తించారు. 18 ఏండ్ల వయసులో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా శకుంతలకు రవికుమార్తో వివాహం జరిగింది. ఆ సమయంలో కమల్ సింగ్లా అనే వ్యక్తితో శకుంతల డేటింగ్లో ఉండటంతో ఇద్దరూ కలిసి రవికుమార్ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు. రవిని హత్య చేసిన అనంతరం కమల్ వ్యాపారం సాగిస్తున్న రాజస్ధాన్లోని అల్వార్లో బాధితుడి మృతదేహాన్ని పాతిపెట్టారు.
కొద్దిరోజుల తర్వాత వారు రవి మృతదేహాన్ని బయటకు తీసి శరీర భాగాలను అల్వార్ హర్యానాలోని రెవారి మధ్య 70 కిలోమీటర్ల రహదారి పొడవునా పడవేశారు. మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించలేరనే ఉద్దేశంతో వారు ఈ పనిచేశారు. ఆపై శకుంతల ఆమె బాయ్ఫ్రెండ్ సహజీవనం చేస్తూ 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్ధానిక పోలీసులు కేసులో పురోగతి సాధించలేకపోవడంతో కేసును క్రైమ్ బ్రాంచ్కు బదలాయించారు.
2018లో రాజస్ధాన్లో జంట ఆచూకీ పసిగట్టిన పోలీసులు కమల్ను అరెస్ట్ చేయగా శకుంతల తప్పించుకుంది. చివరికి అల్వార్లో ఆమె ఆచూకీ లభించడంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఆచూకీని తెలిపిన వారికి పోలీసులు రూ 50,000 రివార్డు ప్రకటించారు. కాగా కమల్తో తన సంబంధం భర్తకు తెలిసిందని, తన కదలికలపై నిఘా పెట్టి ఫోన్ కూడా మాట్లాడకుండా అడ్డుకోవడంతో ప్రియుడి సహకారంతో భర్త అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నానని శకుంతల వెల్లడించిందని పోలీసులు తెలిపారు.